కొడుకులను వెనకేసుకొచ్చిన లక్ష్మీ పార్వతి… కుమార్తెలపై కీలక వ్యాఖ్యలు!

దివంగ‌త ఎన్టీఆర్ పేరు మీద రూ.100 నాణేన్ని రాష్ట్రప‌తి చేతుల మీదుగా ఆవిష్కరించే కార్యక్రమం హస్తినలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరుకాలేదు! అయితే తాజాగా ఈ విషయాలపై లక్ష్మీపార్వతి ఫైరయ్యారు.

అవును… ఎన్టీఆర్ పేరు మీద రూ.100 నాణేన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి త‌న‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డంపై ఆయ‌న భార్య నంద‌మూరి ల‌క్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ధ్వజ‌మెత్తారు. ఈ కార్యక్రమం సోమవారం ముగిసిన నేప‌థ్యంలో త‌న‌ను పిల‌వ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ రాష్ట్రప‌తి, ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి ఆమె లేఖ రాశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి… కుమారులపై కాస్త సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ… కుమార్తెలపై మాత్రం తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇందులో మరిముఖ్యంగా పురందేశ్వరిపై తీవ్రస్థాయిలో విమ‌ర్శలు గుప్పించారు. ఇక‌పై త‌న పోరాటం పురందేశ్వరిపై అని ఆమె ప్రక‌టించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నందమూరి లక్ష్మీ పార్వతి… దగ్గుబాటి పురందేశ్వరి దుర్మార్గురాల‌ని మండిప‌డ్డారు. తమ కొడుకులు అమాయ‌కుల‌ని చెప్పిన ఆమె… కుమార్తెలు పురందేశ్వరి, భువ‌నేశ్వరులే దుర్మార్గుల‌ని ఫైర్ అయ్యారు. పురందేశ్వరి తిరిగే ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో తాను వ్యతిరేకంగా తిరుగుతాన‌ని ఆమె ప్రక‌టించారు.

ఇదే క్రమంలో… త‌న వ‌ల్ల మీకు జ‌రిగిన న‌ష్టం ఏంట‌ని ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల్ని ల‌క్ష్మీపార్వతి ప్రశ్నించారు. వీళ్ల గురించి ఎన్టీఆర్ ఏమ‌న్నారో ప్రజ‌ల‌కు వివ‌రిస్తూ ప్రచారం చేస్తాన‌ని ఆమె హెచ్చరించారు. పురందేశ్వరి తిరిగే చోట ఒక్క సీటు కూడా రాకుండా చేస్తాన‌ని ఆమె ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం… వీళ్ల నుంచి ఇంకెన్నాళ్లు అవ‌మానాలు భ‌రించాల‌ని ఆవేద‌న‌తో ప్రశ్నించిన లక్ష్మీపార్వతి… ఎన్టీఆర్ క‌ష్టాల్లో వుంటే పురందేశ్వరి ఏనాడైనా వ‌చ్చిందా? అని సూటిగా నిల‌దీశారు. ఎన్టీఆర్‌ ను చంద్రబాబు వెన్నుపోటు పొడ‌వ‌డానికి పురందేశ్వరే ప్రధాన కార‌కురాల‌ని ఆమె సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.