కుక్కని చంపడానికి వాడేరూలు… పుష్కలంగా వాడుతోన్న టీడీపీ!

నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణపై ఆయన తమ్ముడి భార్య చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.. పోలీస్ స్టేషన్‌ కు చేరుకుంది.. వైసీపీ కూడా ఎంటరైంది!

అవును… లైంగికంగా వేధింపుల కేసులో మజీ మంత్రి, టీడీపీ నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన నారాయణపై కేసు నమోదైంది. నారాయణ తనను లైంగికంగా వేధిస్తోన్నాడంటూ ఆయన తమ్ముడి భార్య కృష్ణప్రియ ఆరోపించిన నేపథ్యంలో… హైదరాబాద్‌ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది.

అయితే ఈ విషయాలపై స్పందించిన నారాయణ అండ్ కో… కృష్ణప్రియ మానసిక పరిస్థితి బాగోలేదని, ఆమెకు మెంటల్ అని ఆరోపించింది! దీంతో వైసీపీ రంగంలోకి దిగింది… టీడీపీకి అధికారిక రోగం మెంటల్ అంటూ చురకలు అంటిందించి. ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది.

తన భార్య మానసిక వ్యాధితో బాధపడుతోందంటూ నారాయణ సోదరుడు పొంగూరు సుబ్రహ్మణ్యం చేసిన ఆరోపణలపై అధికార వైసీపీ స్పందించింది. పరువు పోతుందంటే వెంటనే మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చేయాలని.. అదే చంద్రబాబు లాజిక్ అని ఎద్దేవా చేసింది. మొదటి నుంచీ తెలుగుదేశానికి, ఆ పార్టీ నాయకులకు మహిళలు అంటే చులకనే అని ఆరోపిస్తూ… ఈ మేరకు కొన్ని ఉదాహరణలు బయటకు తీసింది!

ఈ సందర్భంగా… “ఒకడేమో ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి అంటాడు” అంటూ పరోక్షంగా హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ గతంలో ఒక సినిమా ఫంక్షన్ లో వేదికపై చేసిన స్టేట్‌ మెంట్లను ప్రస్తావించింది.

ఇదే సమయంలో “కారు షెడ్‌ లో ఉండాలి.. ఆడది ఇంట్లో ఉండాలి..” అంటూ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను కూడా వైసీపీ ఈ సందర్భంగా గుర్తు చేసింది.

అనంతరం… “కోడలు మగబిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా” అంటూ చంద్రబాబు చేసిన ప్రకటనలనూ ఈ సందర్భంగా అధికారపార్టీ ప్రస్తావించింది. కాల్ మనీ పేరిట మహిళలను వేదించుకుతిన్నది కూడా టీడీపీ నాయకులేనని పేర్కొంది.

అదేవిధంగా… కోడలిని వేధించిన కేసులు ఎదుర్కొన్న కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇప్పుడు టీడీపీలోనే ఉన్నాడని వైసీపీ ఎద్దేవా చేసింది. ఈ సందర్భంగా… తమ పరువు, ప్రతిష్ఠకు భంగం కలుగుతాయనిపిస్తే.. వెంటనే టీడీపీకి అధికారిక రోగం “మెంటల్” గుర్తుకు వస్తుందని చురకలు అంటించింది. ఇది టీడీపీకి బాగా అలవాటేనని ఎద్దేవా చేసింది.

ఈ సందర్భంగా బాలయ్య వ్యవహారన్ని తెరపైకి తెచ్చింది. అప్పట్లో సినీనటుడు బాలకృష్ణ తన ఇంట్లో జరిగిన తుపాకీ కాల్పుల విషయంలో కూడా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే! ఇదే క్రమంలో ఇప్పుడు పొంగూరు ప్రియకు మెంటల్ అంటగట్టి జనం కళ్లకు గంతలు కడుతున్నారని వైసీపీ ధ్వజమెత్తింది.

దీంతో… కుక్కను చంపాలంటే పిచ్చిది అని ముద్రవేయాలని అంటుంటారు.. ఇదే క్రమంలో టీడీపీలో చట్టం నుంచి తప్పించుకోవాలంటే పిచ్చి ముద్ర వేయడమో, వేసుకోవడమో చేస్తుంటారని అంటున్నారు!!