బూటు కాళ్లతో బాబు చేసిన పనులు.. వాటి ఫలితాలు ఇవి!

చంద్రబాబు పేరు చెబితే అంతెత్తున లేచే వైసీపీ లీడర్ల లిస్ట్ లో మంత్రి కొట్టు స‌త్యనారాయ‌ణ చేరిపోతున్నారు. గతకొన్ని రోజులుగా చంద్రబాబుపై రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఏపీలో జరిగిన మ‌హా యజ్ఞంపై చంద్రబాబు చేసిన కామెంట్లపై మంత్రి కొట్టు రియాక్ట్ అయ్యారు. దేవుడితోనే పరాచకాలా.. నిన్ను దేవుడు కూడా క్షమించడు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా ఏపీలో దేవ‌దాయ శాఖ ఆధ్వర్యంలో మ‌హాయజ్ఞం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం మొత్తాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యవేక్షించారు. అయితే ఈ మహాయజ్ఞం చేసింది రాష్ట్రం కోసమో, రాష్ట్ర భవిష్యత్తు కోసమో కాదని… ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ని కేసుల నుంచి తప్పించడానికే చేశారంటూ చంద్రబాబు ఆరోపించారు. దీంతో… బాబు వ్యాఖ్యలపై ఆ శాఖ మంత్రి కొట్టు స‌త్యనారాయ‌ణ నిప్పులు చెరిగారు.

మహాయజ్ఞంపై చంద్రబాబు వ్యాఖ్యలు ఆయ‌న‌ దిగజారుడుతనానికి పరాకాష్ట అని ఫైర్ అయిన మంత్రి… మ‌హాయ‌జ్ఞం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కాళ్లకు చెప్పులు వేసుకుని వచ్చారని చెబుతున్న చంద్రబాబు కళ్ళున్న కబోది అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనకదుర్గమ్మ గుడిలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేయించిన నీచ చరిత్ర చంద్రబాబుదని మంత్రి కొట్టు విమ‌ర్శించారు.

ఇదే సమయంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా ఎన్నో గుళ్ళు కూల్చారని, విగ్రహాలు ధ్వంసం చేశారని, రథాలు తగలబెట్టించారని మంత్రి ఆరోపించారు. ఫలితంగా… 2019లో ప్రజలు ఛీ కొట్టినా.. బుద్ధి రాకుండా మళ్ళీ జనాన్ని మోసం చేసేందుకు మాయమాటలతో మారీచుడిలా తయారయ్యారని విమర్శించారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు బూట్లు వేసుకుని చేసిన రెండు పనులను తెరపైకి తెచ్చిన కొట్టు… వాటి ఫలితాలనూ వివరించారు.

గతంలో చంద్రబాబు తిరుమలలో ధ్వజస్తంభం వరకు బూట్లు వేసుకుని వెళ్లారని.. దాని ఫలితంగా అలిపిరి దుర్ఘటన జరిగిందని.. అయినా కూడా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మంత్రి కొట్టు విమర్శించారు. అప్పటికీ జ్ఞానం రాలేదు సరికదా… అమరావతి శంకుస్థాపనలో కూడా చంద్రబాబు బూటు కాళ్లతో వెళ్లి కొబ్బరికాయ కొట్టారని.. దాని ఫలితమే నేటీ అమరావతి పరిస్థితి అని కొట్టు గుర్తుచేస్తున్నారు. దీంతో చంద్రబాబు బూట్ల ఫోటోలు ఆన్ లైన్ లో పోస్ట్ పెడుతూ…. కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!