కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న కిశోర్ చంద్రదేవ్ కూతురు

ఈ మధ్య మహిళలు ఎక్కువగానే తెలుగు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ జాబితాలోకి ఉత్తరాంధ్ర కు చెందిన ఒక న్యాయవాది చేరబోతున్నారు.

తండ్రి  కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి తెలుగుదేశం వైపు అడుగు లేస్తున్నా ఆమె మాత్రం  అదే పార్టీలోనే ఉండాలనుకోవడమే కాదు, ఆ పార్టీ టికెట్  మీద లోక్ సభకు పోటీ చేయాలని కూడా అనుకుంటున్నారు.

ఆమె ఎవరో కాదు, వైరిచర్ల శ్రుతీ దేవి. ఢిల్లీలో న్యాయవాదిగా ఆమె ప్రాక్టీస్ చేస్తున్నారు.  కాంగ్రెస్ మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేశ్ కూతురు. ఆమె సోషల్ యాక్టివిస్టు, రచయిత్రి కూాడా.

తాను కాంగ్రెస్ టికెట్ మీద ఆంధ్రప్రదేశ్ అరకు  లోక్ సభ నియోజకవర్గం నుంచి  పోటీచేయాలనుకుంటన్నారు.  పార్టీ మారిన నేత కూతురుకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా లేక కొత్త వారికి అవకాశమిస్తుందా, వేచి చూడాలి. మొత్తానికి ఆమె ఫుల్ టైం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. తండ్రి కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినపుడు శ్రుతి దేవి బాగా ప్రచారం చేశారు. అలా ఆమె ఢిల్లీలో ఉన్నా నియోజకవర్గంలో బాగా తెలిసిన వ్యక్తే. తాను చాలా కాలంగా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నానని కూడా ఆమె ది హిందూ కు చెప్పారు.

‘ ఇతర పార్టీలు నా మీద ఎవరిని పోటీకి పెట్టినా నేను భారీ మెజారిటీ తో గెలుస్తాను,’ అని ధీమా  వ్యక్తం చేస్తున్నారు.

కిశోర్ చంద్రదేశ్ ఈ మధ్య కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. రెండురోజుల కిందట ఆయన ఢిల్లీలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని కలిశారు.అనంతరం మాట్లాడుతూ తొందర్లో తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు కూడా చెప్పారు. 2019 ఎన్నికల్లో అరకు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేవిషయం ప్రస్తావించినపుడు తాను  ఎలాంటి షరతులు లేకుండా టిడిపిలో చేరానని  కిశోర్ చంద్రదేవ్ చెప్పారు. మొన్న చంద్రబాబునాయుడిని కలుసుకున్నపుడు తాను ఎన్నికల్లో పోటీ చేసే విషయం ప్రస్తావనకు రాలేదని ఆయన అన్నారు. కిశోర్ చంద్రదేవ్ ఫిబ్రవరి 24న అమరావతిలో తెలుగుదేశం కండువా కప్పుకోబోతున్నారు.