జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ 2014లో స్థాపించి అదే సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయకుండా చంద్రబాబుకి మద్దతు తెలిపి టీడీపీ అధికారం చేజిక్కించుకోవటంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రభావం చూయించలేకపోయారు. దాంతో జనసేన పార్టీ సత్తా, ప్రభావం మీద రాష్ట్ర ప్రజలలో ఎన్నో అనుమానాలు ఏర్పడ్డాయి. పవన్ పార్టీని మూసేసి దుకాణం సర్దేస్తారని ప్రత్యర్థి వర్గాలు దారుణంగా హేళన చేశాయి.

అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన విజయాలతో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప్రభావం చూపించిందని స్పష్టంగా చెప్పవచ్చు. జనసేన పార్టీ చాలా వరకు కార్యకర్తల బలంతోనే ఎక్కువగా పంచాయతీలను గెలుచుకుంది. గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా జనసేన పార్టీ ప్రభావం కనబడింది. చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడి జనసేన పార్టీ ద్వితీయ స్థానంలో నిలబడటం జరిగింది. జనసేన పార్టీ ఈ విధమైన ఫలితాలను రాబట్టటంతో ప్రత్యర్థి పార్టీలు కంగారు పడుతున్నాయని తెలుస్తుంది.
జనసేన విజయం మిగిలిన పార్టీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఇబ్బందికర అంశంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి వెంట ఉండి కాపు కాస్తూ గెలిపిస్తున్న కాపు సామాజికవర్గం మొత్తం ఇప్పుడు జనసేన పార్టీకి మద్దతు ఇచ్చింది. జనసేన పార్టీకి డబ్బులు లేకపోయినా, పెద్ద తలకాయలు లేకపోయినా సరే గ్రామాల్లో ప్రభావం చూపించడంలో కాపు సామాజిక వర్గం కీలకంగా ఉందని సమాచారం. అంతేకాకుండా ఎన్నికల ఫలితాలలో జనసేన పార్టీ ఎక్కువ స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో ఉండటంతో చంద్రబాబు ఆందోళనలో ఉన్నారని తెలుస్తుంది.
