కూడలిలో కన్నా… మనసంతా అటేనా అన్నా?

అంతా అనుకున్నట్లుగానే ముహూర్తం ఖరారైంది.. బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోం వీర్రాజుపై తనకున్న అక్కసునంతా కక్కేసుకున్న కన్నా… ఎంపీ జీవీఎల్ నరసింహరావు పై కూడా తనదైన విమర్శలు చేశారు. అనంతరం సోముకు ‘కాపీ టూ’ పెడూతూ.. జేపీ నడ్డాకి తన రాజీనామా లేఖను పంపించారు! ఇంతవరకూ ఊహించిందే కానీ… వాట్ నెక్స్ట్?

అవును… ప్రస్తుతం జనసేన – టీడీపీ కూడలిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, ఎవరివైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తిగా మారింది. గుంటూరు జిల్లాలో సీనియర్ కాపు సామాజికవర్గ నాయకుడిగా పేరున్న కన్నా… పెదకూరపాడు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఈ రేంజ్ సీనియర్ నాయకుడి కోసం అటు జనసేన – ఇటు టీడీపీలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు!

ఈ క్రమంలో ఇప్పటికే జనసేన నేత నాదేండ్ల మనోహర్, కన్నా తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయని జనసైనికులు సైతం పెదవి విరిచారు కూడా! అయితే… జనసేనకు మనసంతా కన్నాపై ఉన్నా కూడా… కన్నా మనసుమాత్రం చంద్రబాబువైపు లాగుతుందని అంటున్నారు ఆయన వర్గీయులు!

మరి కన్నా మెడలో చేరే కండువా రంగు పసుపా.. ఎరుపా.. అన్నది తెలియాలంటే మరి కాసేపు ఎదురుచూడాల్సిందే!!