తెలుగు దేశం పార్టీ అత్యంత ప్రాధాన్యమిచ్చే కార్యక్రమం మహానాడు, ఈసారి మరింత భిన్నంగా, గౌరవంగా నిర్వహించనున్నారు. విశేషంగా చెబతున్న కారణం చంద్రబాబు నాయుడు 75వ వసంతంలో అడుగుపెట్టడం. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ మహాసభలను వైభవంగా జరపాలని నిర్ణయించింది. మరోవైపు, కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బలమైన ఆధిక్యం సాధించడంతో పాటు 2029 వరకూ ఎలాంటి సంకటాలు లేవనే విశ్వాసంతో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు మహానాడు చాలా జిల్లాల్లో జరిగింది కానీ ఈసారి తొలిసారి కడప జిల్లాలో నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా కడప వైసీపీ గడ్డగా భావించబడుతుంది. కానీ 2024 ఎన్నికల్లో టీడీపీ కీలక నియోజకవర్గాలైన కడప, కమలాపురం లాంటి ప్రాంతాల్లో విజయాలు సాధించింది. ఈ విజయాలను మరింత బలోపేతం చేసేందుకు మహానాడును అక్కడే నిర్వహించడం ద్వారా కార్యకర్తలకు నూతన ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు.
సభలో పాల్గొనాలనుకునే వారిని మండల స్థాయిలోనే మొబిలైజ్ చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు 7సారి వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించారు. సాంకేతిక ప్రచారం కోసం ఐటీడీపీకి బాధ్యతలు అప్పగించగా, వసతి, భోజనం, వాహనాలు వంటి లాజిస్టిక్స్పై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.
మహానాడు ఈసారి కేవలం పార్టీ సమావేశం మాత్రమే కాదు, కడపలో పార్టీకి నూతన శక్తిని పోస్తుందన్న విశ్వాసంతో తెలుగు తమ్ముళ్లు ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మహానాడు వేదికగా పార్టీ నూతన కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రకటించే అవకాశం ఉంది.