కడపలో పొలిటికల్ హీట్… వైఎస్ విజయమ్మ.. వైఎస్ సౌభాగ్యమ్మ.. సునీత!

ఏపీపీసీసీ చీఫ్ గా తనదైన శైలిలో చెలరేగిపోతున్న వైఎస్ షర్మిల.. అటు పార్టీ కేడర్ లో ఉత్సాహం కలిగించడంతోపాటు ఇటు వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కడపలో పర్యటించిన ఆమె… అటు రాజకీయ అంశాలతో పాటు ఇటు కుటుంబ విషయాలనూ ప్రస్థావించారు.. ఇదే సమయంలో తన ఐడెంటిటీ “వైఎస్ బ్లడ్” అని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా రావడం, పోలవరం పూర్తయ్యేవరకూ తాను ఏపీని వీడనని తెలిపారు!!

ఈ క్రమంలో వైఎస్ జగన్ లక్ష్యంగా పావులు కదుపుతున్న షర్మిళ… కడప జిల్లాలో అన్నను టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉన్న సాధ్యాసాధ్యల సంగతి ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిళకంటే ఎక్కువగా ఎవరికీ తెలియనప్పటికీ… వైసీపీకి తనవల్ల అయినంత డ్యామేజ్ చేయాలని మాత్రం భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా షర్మిళ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా… తాను కోస్తాంధ్ర ప్రాంతంలో పోటీచేయాలని షర్మిళ భావిస్తున్నారంట. ఫలితంగా ఆ ప్రాంతాల్లో తాను నేరుగా పోటీ చేయడం వల్ల ఆ ప్రభావం పక్కనున్న కొన్ని నియోజకవర్గాలపై కూడా పడే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నారని అంటున్నారు. ఇక ప్రధానంగా కడ్దప జిల్లాలో పులివెందుల అసెంబ్లీ, కడప లోక్ సభ స్థానాల్లో తన బాబాయ్ వైఎస్ వివేకా కుటుమ సభ్యులకు కాంగ్రెస్ నుంచి అవకాశం ఇవ్వాలని షర్మిళ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో… దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతను కడప లోక్ సభ స్థానానికి పోటీ పెట్టాలని షర్మిళ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో… పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మను బరిలోకి దింపాలని పథక రచన చేస్తున్నారని ప్రచారం మొదలైంది. ఫలితంగా… సొంతజిల్లాలోనే తన అన్న జగన్ కు షాకివ్వాలని షర్మిళ భావిస్తున్నారని అంటున్నారు.

ఈ క్రమంలో ఇదే జరిగితే… తన కొడుకు కోసం విజయమ్మ రంగంలోకి దిగినా ఆశ్చర్యం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో జగన్ దూత ఒకరు విజయమ్మతో మాట్లాడారని.. ఇంట్లోవాళ్లూ, బయటివారూ ఏకమై దాడి చేస్తున్న సమయంలో ఆమె సహాయసహకారాలను ఆశిస్తున్నట్లు తెలిపారని కథనాలొస్తున్నాయి. అయితే… ఈ విషయంలో విజయమ్మ ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు.. ఎలా స్పందించారనేది మాత్రం ఇంకా తెరపైకి రాలేదు!!

ఏది ఏమైనా… ఈదఫా వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న ఈ ఇంటర్నల్ వార్ తో కడప రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఫైనల్ గా ఎన్నికల నాటికి ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయి.. పరిస్థితులు ఎలా మారతాయనేది వేచి చూడాలి.