ఇరకాటంలో వైసీపీ జోగి రమేష్: గుంటూరులో ఉద్రిక్తత

జగన్ పై దాడి కేసు విచారణను ముమ్మరం చేశారు పోలీసులు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై చంద్రబాబే దాడి చేయించారన్న వ్యాఖ్యలపై జోగి రమేష్ ను విచారించారు పోలీసులు. టీడీపీ కార్యకర్తే జగన్ పై హత్యాయత్నం చేశాడంటూ జోగి రమేష్ ఇటీవల ఆరోపణలు చేశారు. దీంతో ఆయన చేసిన ఆరోపణలపై టీడీపీ నేత, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన పోలీసులు ఈ నెల 6 న విచారణకు హాజరు కావాలని, చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న జోగి రమేష్ ఈరోజు గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు.జగన్ పై చంద్రబాబు దాడి చేయించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ప్రశ్నించారు.

నకిలీ సభ్యత్వ కార్డుపై టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపారు. జగన్ పై దడి జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా…నిందితులు ఎవరో తేల్చని ప్రభుత్వం, నా వ్యాఖ్యలపై ప్రశ్నించడం ఏంటని ప్రశ్నించారు జోగి రమేష్. కేసును నీరు గార్చడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…శ్రీనివాస్ అనే వ్యక్తి టీడీపీకి సంబంధిన వ్యక్తిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని నేను చెప్పను. అంతకుముందు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా మేము టీడీపీ వాళ్ళమే అని చెప్పారు. అదే విషయాన్ని నేను మీడియా ద్వారా తెలియజేశాను. జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యయత్నం కేసును నీరు గార్చే కుట్రలో భాగంగా మాకు నోటీసులు ఇచ్చి అరండల్ పేట పోలీస్ స్టేషన్లో హాజరవాలన్నారు.

జగన్ మోహన్ రెడ్డిని ఖైమా ఖైమా చేస్తాం అన్న కేశినేని నాని ఏం చేశారు? పోలీస్ వ్యవస్థ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని చంపాలంటే ఇలా ప్లాన్ చేస్తామా అన్న మంత్రి సోమిరెడ్డి మోహన్ రెడ్డిని మీరు ఏం చేశారని మీడియా ముఖంగా అధికార ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తున్నా అన్నారు. జోగి రమేష్ జగన్ పై దాడి కేసులో పోలీస్ స్టేషన్ కి హాజరవడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.