నిజం చెప్పాలంటే… ఏపీ ప్రభుత్వ పాలనపై ఇప్పటివరకూ ప్రతిపక్షాలు సరైనస్థాయిలో విమర్శించింది లేదు. దానికి కారణం.. “మా ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు అవకాశమిచ్చే పరిస్థితులు లేవు.. పాలన బాగా జరుగుతుంది” అని చెప్పుకుంటుంటారు వైకాపా నేతలు. ఎందుకంటే… ఇప్పటివరకూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ… వైసీపీపై చేసిన విమర్శల్లో మెజారిటీ విమర్శలు… పార్టీకి సంబందించినవే తప్ప… పాలనకు సంబందించినవి కావు. ఈ సమయంలో తనకు కూడా మరో ఆప్షన్ లేదో ఏమో కానీ… పోలవరం వెళ్లాలని ఫిక్సయ్యారు పవన్!
అవును… ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేయడానికి తాజాగా పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించాలని ఫిక్సయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పోలవరాన్ని సందర్శించి.. ప్రాజెక్టు పనులు, దాని ఎత్తు.. అనే అంశాలపై జగన్ ని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్నారంట జనసేన అధినేత. ఇదే సమయంలో తమ హయాంలో ఎక్కువ పనులు జరిగాయని, ఇప్పుడు నత్తనడకన సాగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో… పోలవరం పేరుతో వైసీపీ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టుపెడుతోందని అంటున్నారు జనసేన నేతలు.
పైగా… ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్.. పోలవరంపై జలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు కూడా చేసి వచ్చారు. ఏపీ ప్రభుత్వం సరిగా పనులు చేయడంలేదని హస్తిన కేంద్రంగా విమర్శలు గుప్పించారు. అనంతరం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును స్వయంగా సందర్శించడానికి వెళ్లబోతున్నారు. ఈ విషయాలపై స్పందించిన నాదెండ్ల మనోహర్… పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేసేందుకు అంగీకరిస్తూ ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసిందని ఆరోపిస్తున్నారు.
ఇదే క్రమంలో… మరింత వాయిస్ పెంచిన ఆయన… పోలవరం జగనన్న పాపాల పథకం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి ఖర్చులు రీ-ఇంబర్స్ చేస్తామని కేంద్రం చెప్పినా.. పనులెందుకు చేపట్టడం లేదని ప్రశ్నించిన ఆయన… ప్రాజెక్టు పూర్తి చేద్దామనే చిత్తశుద్ధి సీఎం జగన్ కు లేదని.. ఫలితంగా పోలవరం నిర్మించకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా… ఇప్పటికే పలు డెడ్ లైన్లు పెట్టినా.. ఏదీ నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు.
దీంతో… అటు పవన్ కు – ఇటు నాదెండ్లకు ప్రశ్నల వర్షాలు కురిపిస్తూ – కొన్ని సూచనలు చేస్తున్నారు నెటిజన్లు – విశ్లేషకులు!
“పోలవరాన్ని పూర్తిచేసి ఎన్నికలకు వెళతాం, రాసుకో.. జగన్ అని 2018 లో చెప్పిందెవరు, మాట తప్పిందెవరు?” అన్న విషయం గుర్తుంచుకోవాలని నాదెండ్లకు గుర్తుచేస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో… పవన్ ఏ హోదాలో అక్కడకు వెళ్తున్నారు..? పోలవరం పనుల గురించి ఆయనకు అక్కడ ఎవరు వివరిస్తారు..? పోలవరాన్ని సందర్శించి పవన్ ఏం చేస్తారు..? అనే విషయాలు కాసేపు పక్కనపెడితే… జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరాన్ని… తామే పూర్తిచేస్తామంటూ టీడీపీ సర్కార్ బాధ్యతలు తీసుకున్న విషయం… పవన్ మర్చిపోకూడదు అని సూచిస్తున్నారు విశ్లేషకులు. ఆ విషయాలు దృష్టిలో పెట్టుకోకుండా.. ఆ విషయాలు విస్మరించి జగన్ ని విమర్శిస్తే… మన పార్టీకి ప్రయోజనం ఉండదని సలహా ఇస్తున్నారు జనసైనికులు!