ఒంటరి పోరు వైపు మొగ్గు చూపుతున్న జనసేనాని.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాదు కాదు, రెండు పార్టీలనీ ఒకే గాటన కట్టేసి, ‘సీబీఎన్ దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్’ అంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే.

‘సీబీఐ దత్త పుత్రుడు వైఎస్ జగన్’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ర్యాగింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?’ వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినప్పటినుంచీ ఈ పొత్తుల దుమారం చెలరేగింది.

అయితే, కాలక్రమంలో పరిస్థితులు మారిపోయాయ్. టీడీపీతో కలిసి వెళ్ళడం వల్ల రాజకీయంగా జనసేనకు ఎలాంటి ప్రయోజనం వుండదన్న నిర్ణయానికి జనసేనాని వచ్చేసినట్లున్నారు. మరోపక్క, మిత్రపక్షం బీజేపీని కూడా పవన్ కళ్యాణ్ దూరం పెడుతున్నట్లు కనిపిస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న సంకేతాల్ని జనసేనాని పంపగలుగుతున్నారు. దాంతో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఆశావహులు, జనసేన కోసం సర్వసన్నద్ధమవుతున్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా వుండాల్సిన ప్రాథమిక లక్షణమిదే.

అయితే, ప్రస్తుతానికి ‘ఒంటరి పోటీ’ వైపుగా అడుగులేస్తున్న జనసేనాని, మాట మార్చేస్తే.?