పవన్ రివేంజ్ తీరాలంటే… పొత్తుతో అవ్వదు!

రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్న జనసేనకు కొన్ని ప్రత్యేకమైన టార్గెట్స్ ఉన్నాయని.. వాటిని సాధించడం కూడా అతిముఖ్యమని.. తద్వారా తన రేంజ్ ఏమిటో చూపించుకోవాలని పవన్ ఫీలవుతుండగా.. జనసైనికులు కూడా అదే కసి చూపిస్తున్నారు! అందుకు కలిసొచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని స్కెచ్ లు వేస్తున్నారట!

విషయానికొస్తే… జనసేనానికి జగన్ అంటే ఎందుకో ముందునుంచీ పడదు! అసలు పవన్ రాజకీయాల్లోకి వచ్చిందే.. జగన్ ను విమర్శించడానికి, జగన్ ను ఓడించడానికి అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం! అయితే ప్రస్తుతం జగన్ ను కొట్టే పరిస్థితి లేదు కాబట్టి.. మిగిలిన కొంతమంది వ్యక్తిగత శత్రువులను టార్గెట్ చేయాలని పవన్ ఫిక్సయ్యారంట. అందులో బలంగా వినిపిస్తున్న పేర్లు… పేర్ని నాని – కొడాలి నాని – అంబటి రాంబాబు – ఆర్కే రోజా – గుడివాడ అమర్ నాథ్!

రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో.. వీరైదుగురిని ఓడించడం కూడా అంతే ముఖ్యమని జనసేనాని ఫిక్సయ్యారంట. అందులో భాగంగానే… ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభను పేర్ని నాని ఇలాకాలో పెడుతున్నారంట! అయితే… సభలు పెట్టినంత మాత్రాన్న పేర్ని నాని కి చెక్ పెట్టినట్లే అని భావిస్తే అంతకు మించిన రాజకీయ అజ్ఞానం మరొకటి ఉండదని.. గ్రౌండ్ లెవెల్ లో పాతుకుపోయిన నానీని కొట్టాలంటే.. మరింతగా జనసేన కష్టపడాలని అంటున్నారు విశ్లేషకులు!

అయితే… పేర్ని నానిపై నేరుగా ప్రతీకారం తీర్చుకోవాలంటే.. పేర్ని నానీకి పరాభవాన్ని రుచిచూపించాలంటే.. రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేయాలని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే… రాబోయే ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ పొత్తులో ముందుకు వెళ్తే… ఈ స్థానంలో ఇప్పటికే బలమైన బీసీ నేతగా కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన్ని కాదని బాబు… జనసేనకు ఆ టిక్కెట్టు ఇచ్చే ప్రసక్తి లేదు!

ఇదే సమస్య అంబటి రాంబాబు విషయంలోనూ వర్తిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. అంబటి నియోజకవర్గమైన సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణను పోటీకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కన్నాను కాదని జనసేనకు ఆ టిక్కెట్టు ఇచ్చే అవకాశం లేదు! కన్నా జనసేనలో చేరి ఉంటే… పరిస్థితులు వేరుగా ఉండేవేమోకానీ… ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు!

ఇక కొడాలి నానీ విషయానికొస్తే… ప్రస్తుతం గుడివాడలో జనసేనకు సరైన అభ్యర్థే లేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గుడివాడను తన అడ్డాగా చేసుకుని పాతుకుపోయిన కొడాలిని కొట్టాలంటే.. పవన్ రాజకీయ తపస్సు చేయాలని.. యుద్దంలా పోరాడాలని అంటున్నారు. ఇది జరిగేపని కాదనేది జనసేనలో ఒకవర్గం వాదన కూడా!

ఇక నగరిలో ఆర్కే రోజాపై కూడా జనసేన రివేంజ్ తీర్చుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే… ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న చినబాబు లోకేష్… ఇప్పటికే నగరి టీడీపీ అభ్యర్థిగా గాలి భానుప్ర‌కాశ్‌ పేరు ప్రకటించేశారు. దీంతో… ఇక గుడివాడ అమర్ నాథ్ విషయంలోనే ప్రస్తుతానికి జనసేన ఏమైనా ట్రై చేసుకోవచ్చనేది విశ్లేషకుల మాటగా ఉంది! అది కూడా ఈలోపు చినబాబు అభ్యర్థిని ప్రకటించేస్తే.. ఇక జనసేన కు పర్సనల్ రివేంజ్ లు తీర్చుకునే చాన్స్ లేదన్నమాట! సో… జనసేన రివేంజ్ లు తీరాలంటే పొత్తుతో అవ్వదన్న మాట!!