జనసేనకి 72 సీట్లట.! నమ్మొచ్చా.?

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయబోయే సీట్ల సంఖ్య అక్షరాలా డెబ్భయ్ రెండు అట.! ఏంటి నిజమేనా.. 72 సీట్లు జనసేనకు కేటాయించడానికి టీడీపీ ఒప్పుకుందా.? లేదంటే, 27 సీట్లనే రివర్స్ చేసుకుని, 72 సీట్లుగా జనసేన భ్రమల్లో వుందా.? చాలా డౌటానుమానాలు తెరపైకొస్తున్నాయ్.

జనసేన పార్టీకి 65 నుంచి 70 సీట్లు ఇస్తేనే జనసేన – టీడీపీ మధ్య ఓటు షేరింగ్ సజావుగా సాగుతుందని జనసేన శ్రేణులు భావిస్తున్నమాట వాస్తవం. గ్రౌండ్ లెవల్‌లో ఇరు పార్టీల మధ్యా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి కూడా.

అయితే, జనసేనకు 72 సీట్లు కేటాయిస్తే, మిగిలిన 103 సీట్లలోనే టీడీపీ పోటీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ బీజేపీ కూడా కలిసొస్తే, ఆ పార్టీకి ఓ అరడజను అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే.. గట్టిగా 100 సీట్లలోనూ పోటీ చేసే అవకాశం వుండదు టీడీపీకి.

ఎలా చూసినా ఈ లెక్క కరెక్ట్ కాదనిపిస్తోంది. కానీ, కింది స్థాయిలో మాత్రం, ఇదే కరెక్ట్ ఈక్వేషన్.. అన్న ప్రచారమైతే జరుగుతోంది. పైగా, జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలకు సమాచారమిచ్చారంటూ ప్రచారం జరుతుండడం గమనార్హం.

త్వరలో.. అతి త్వరలో జనంలోకి పవన్ కళ్యాణ్ రానున్నారనీ, అప్పట్లోగా మరింత స్పష్టత వస్తుందని నాదెండ్ల మనోహర్, పార్టీ ముఖ్య నేతలకు చెప్పారట.

కాగా, జనసేన నుంచి జరుగుతున్న ఈ ప్రచారంపై టీడీపీ గుస్సా అవుతోంది. జనసేనకు పాతిక నుంచి ముప్ఫయ్ సీట్లే ఎక్కువన్నది టీడీపీ వాదన.!