Jagan Warning: తన హయాంలో తీసుకొచ్చిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలుత కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. తర్వాత చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు.. తర్వాత కోటి సంతకాల సేకరణ చేసి, గవర్నర్ కు సమర్పించారు.. పరోక్షంగా ఈ విషయంలో ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చెప్పకనే చెప్పారు.. అయినప్పటికీ కూటమి ఆగలేదు.. మొండిగా ముందుకెళ్లే ప్రయత్నం చేసింది!
ఈ సమయంలో జగన్ మరింత సీరియస్ అయ్యారు. ఇందులో భాగంగా.. పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దక్కించుకోవడానికి ఎవరూ ముందుకు రావొద్దని అన్నారు. టెండర్లలో ఎవరూ పాల్గొనదొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా తీసుకున్నా, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేయడంతో పాటు ప్రభుత్వమే తీసుకుంటుందని హెచ్చరించారు. పీపీపీ పెద్ద స్కామ్ అని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోపు జైలుకు పంపుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అది ఇప్పుడు అద్భుతంగా పనిచేసింది!
ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అత్యంత బలంగా ఉంది.. మరోవైపు 15 ఏళ్లు కూటమి ఇలానే ఉండాలని కోరుకుంటున్న పవన్, వైసీపీ మళ్లీ రాదని గట్టిగా చెబుతున్నారు.. అయినప్పటికీ చంద్రబాబు మాట ఎవరూ ఎందుకు వినలేదు..?
ఈ ప్రభుత్వం మొదటి విడతలో నాలుగు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలవగా.. మూడు కాలేజీలకు కనీసం టెండర్లు వేయడానికి కూడా ఎవరూ ఎందుకు ముందుకు రాలేదు..?
అంటే.. నెక్స్ట్ టైమ్ మళ్లీ జగనే అధికారంలోకి వస్తారు.. ఈ సమయంలో ఉన్న మూడున్నరేళ్ల కోసం ఇంత రిస్క్ అవసరమా.. అని అనుకున్నారా..?
అంటే… కేంద్రంలో చక్రం తిప్పుతూ, రాష్ట్రంలో ఎంతో బలంగా ఉన్న చంద్రబాబు కంటే.. జగన్ నే పారిశ్రామిక వేత్తలు కూడా ఎక్కువగా నమ్ముతున్నారా..?

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటైజేషన్ చేయడాన్ని జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి తాను చెప్పాలనుకున్నది చెప్పి… ప్రజల అభిప్రాయాలను కూడా బలంగా చెప్పే ప్రయత్నంలో భాగంగా కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు.. అంతకు మించిన సంతకాలతో ప్రజలు తమ అభిప్రాయాలను బలంగా చెప్పారు. దీంతో.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు.. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని.. పైగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆస్పత్రులు మరింత బాగా నడుస్తాయని.. ప్రభుత్వ ఆసుపత్రులకు మించిన వైద్యసేవలు అందుతాయని చెపుకొచ్చారు. అందువల్లే 10 మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మొదటి విడతలో భాగంగా… పులివెందుల తోపాటు ఆదోని, మార్కాపురం, మదనపల్లె మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచారు.
ఈసారి జగన్ మరింత వాయిస్ పెంచారు. పీపీపీ విధానంలో తమకు కావాల్సిన వాళ్లకు వైద్య కళాశాలల్ని కట్టబెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టెండర్లలో ఎవరూ పాల్గొనదొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా తీసుకున్నా.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోపు ఈ స్కామ్ లో భాగస్వాములు ఐన వారందరినీ జైలుకు పంపుతామని కూడా జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో.. టెండర్లకు మొదట ఇచ్చిన గడువు కంటే మరో వారం గడువు పొడిగించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ గడువు సోమవారంతో ముగిసింది. అయితే… కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీకి.. హైదరాబాద్ కు చెందిన కిమ్స్ సంస్థ మాత్రమే టెండర్ వేసింది. ఇక మిగిలిన మూడు కాలేజీలకు కనీసం టెండర్లు వేయడానికి కూడ ఏ ఒక్క సంస్థా ముందుకు రాలేదు. దీంతో.. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు ఎన్ని చెప్పినా.. ప్రభుత్వం ఎంత మొండిగా ముందుకు వెళ్లినా.. చివరికి ప్రజా పోరాటం, జగన్ వార్నింగే పని చేసిందని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఇంత బలంగా ఉన్నా కూడా… ఆదోని మినహాయిస్తే, మిగిలిన మూడు కాలేజీలకు కనీసం టెండర్ వేయడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడం కూటమి ప్రభుత్వానికి తీవ్ర అవమానమే అని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే… వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని చాలా మంది ప్రజానికంతో పాటు పారిశ్రామిక వేత్తలు, బడా బడా సంస్థలు నమ్మడం వల్లే ఏ ఒక్క సంస్థ మెడికల్ కాలేజీలను తీసుకోడానికి ముందుకు రాలేదని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఇది చంద్రబాబు పొలిటికల్ కెరీర్ కు మరో మాయని మచ్చ అని చెబుతున్నారు విశ్లేషకులు!

