బాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు: జగన్ రియాక్షన్ ఇదే

గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు నాయుడుని మీడియా ఎదుట తనదైన శైలిలో దూషించారు కేసీఆర్. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అందరు మీడియా ముందుకి వచ్చి కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలపై, కేసీఆర్ భాషపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక తమ అధినేతను అంటే టీఆరెస్ శ్రేణులు ఊరుకుంటారా? వారు కూడా మీడియా ముందుకొచ్చి చంద్రబాబు అండ్ కో కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రతిపక్ష నేత జగన్ స్పందించారు.

వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాసలో సాగింది. పలాస, ఉండ్రుకుడియ నుండి ప్రారంభమైన 333 వ రోజు పాదయాత్ర వెంకటాపురం మీదుగా గరుడఖంది వరకు సాగింది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన జగన్, విరామం అనంతరం పలాస భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. “పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఏపీకి హోదా ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాస్తాను అన్నారు. దీనిని ఆహ్వానిస్తున్నాను. మన 25 మంది ఎంపీలకు మరో 17 మంది ఎంపీలు తోడైతే మొత్తం 42 మంది ఎంపీలు అవుతారు. 42 మంది ఎంపీలు హోదాకు మద్దతు తెలపడాన్ని ఎవరైనా సంతోషిస్తారు. బాబు మాత్రం నీచ రాజకీయాలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు వైఎస్ జగన్.

తెలంగాణ ఎన్నికల సమయంలో వైసీపీ టీఆరెస్ పార్టీకే మద్దతుగా ఉంది. టీఆరెస్ గెలిచినప్పుడు వైసీపీ అభిమానులు రాష్ట్రంలో వేడుకలు చేసుకున్నారు. త్వరలో ఏపీ ఎన్నికలు కూడా మొదలవనున్నాయి. సీఎం కేసీఆర్ రిజల్ట్స్ వచ్చాక ఏపీ లో వేలుపెడతాను అన్నారు. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నారు. ఆయన వైసీపీ తరపున ప్రచారం చేస్తారేమో అని ఏపీ రాజకీయాల్లో నడుస్తోన్న చర్చ. చంద్రబాబును గద్దె దింపే దిశగా కేసీఆర్ వైసీపీ తరపున ప్రచారం చేయాలనీ వైసీపీ వర్గాలు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.