1000 కోట్ల ప్రాజెక్టుల కానుక.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
ఉత్తరాది బెల్ట్ లో వైయస్సార్ కాంగ్రెస్ హవా సాగడం వెనక.. ముఖ్యంగా శ్రీకాకుళంలో వైసీపీ క్లీన్ స్వీప్ వెనక వైయస్సార్ సంక్షేమ పథకాల సాయం ఎంతో ఉందన్న సంగతి తెలిసిందే. గత ఎలక్షన్స్లో వైయస్ జగన్మోహన్ రెడ్డికి గొప్ప మెజారిటీ కట్టబెట్టిన జిల్లాగా శ్రీకాకుళం పేరు మార్మోగింది. ఉద్ధానం కిడ్నీ బాధితుల వ్యవహారం సహా ప్రతి పరిస్థితిని తనవైపు తిప్పేసుకోవడంలో జగన్ ఎత్తుగడ ఇక్కడ పెద్ద రేంజులోనే పారింది. అందుకే తన రుణం తీర్చుకునే దిశగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో తొలి అడుగుగా నేడు దాదాపు 1000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఉద్ధానంకి తాగునీటి ప్రాజెక్టు కోసం 600 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేయడం సహా.. కిడ్నీ బాధితులకు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి జగన్ నేడు శంకుస్థాపన చేస్తున్నారు. ప్రతి ప్రాజెక్టుకు పునాది రాయి వేస్తూ జిల్లా ప్రజల మెప్పు పొందుతున్నారు.
శ్రీకాకుళం కిడ్నీ బాధితులకు 200 పడకల ఆస్పత్రి
ముఖ్యంగా ఫ్లోరోసిస్ బాధితులు ఉన్న ఉద్ధానం ప్రాంతంలో రెండు నియోజకవర్గాలను దత్తత తీసుకుని సమస్యల్ని పరిష్కరించేందుకు జగన్ ముందుకొచ్చారు.. పలాస, ఇచ్చాపురం లోని 807 గ్రామాలు.. రెండు మున్సిపాలిటీల్లో అందరికీ నేరుగా తాగునీరు అందించేందుకు శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. ఇందుకోసం 600 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రకటనతో అక్కడ ప్రజల్లో కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
శ్రీకాకుళం రుణం తీర్చుకుంటున్న జగన్
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలిసిస్ పరిస్థితుల్లో ఉన్నవారికి రూ.10వేల పరిహారం ఇస్తున్నామని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. డయాలిస్ స్టేజ్ కి చేరక ముందే వివరాల్ని ఇస్తే వారికి మందుల సాయం అందిస్తాం. మీ డాక్టర్ అప్పలరాజు కోరిక మేరకు కిడ్నీ సమస్యలు స్టేజ్ 3 బాధితులకు ప్రత్యేకించి ఒక ప్యాకేజీ కింద రూ.5000 ఫించను ఇస్తాం. అలాగే పేషెంట్ల కోసం హెల్త్ వర్కర్లను అపాయింట్ చేస్తాం. వ్యాధిగ్రస్తులకు అండదండలు అందిస్తాం… అంటూ ఉరకలెత్తించారు. మొత్తానికి ఉత్తరాది బెల్ట్ లో తనని ఆదరించి ఓటు వేసినందుకు రుణం తీర్చుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని అర్థమవుతోంది. మరో పదేళ్ల పాటు ఈ బెల్ట్ లోంచి ఓటు బ్యాంక్ ఎటూ పోకుండా కాపాడుకునే దిశగా ప్రాజెక్టుల్ని ఖాయం చేస్తుండడం ఆసక్తికరం. శ్రీకాకుళంలో ఉన్న అన్ని కులాల వారికి విడివిడిగా జగన్ భారీ ఉపాధి ప్రాజెక్టుల్ని ప్రకటించడం ఆసక్తికరం.