శ్రీనివాస్ టిడిపి సభ్యుడే..ఇదే సాక్ష్యమా ?

విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన శ్రీనివాస్ తెలుగుదేశంపార్టీ సభ్యుడే అనడానికి వైసిపి శ్రేణులు ఓ సాక్ష్యాన్ని వెలుగులోకి తెచ్చారు. అదే జానిపల్లి శ్రీనివాస్ గుర్తింపు కార్డు. 2016-18 సంవత్సరాలకు గాను శ్రీనివాస్ తెలుగుదేశంపార్టీ సభ్యత్వం తీసుకున్నపుడు ఇచ్చిన గుర్తింపుకార్డు వైసిపి సోషల్ మీడియా విభాగంలో వైరల్ అయ్యింది. చంద్రబాబునాయుడు సంతకంతో ఉన్న సభ్యత్వ కార్డు నెంబర్ 05623210ని శ్రీనివాస్ కు ఉంది. 05623209 నెంబర్ గల గుర్తింపుకార్డు శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజుది.

విచిత్రమేమిటంటే, జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ మీ పార్టీ సభ్యుడే అంటే కాదు మీ అబిమానే అంటూ టిడిపి, వైసిపిలు రెండు ఒకదానిపై మరొకటి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తన ఆరోపణలకు మద్తతుగా టిడిపి నేతలు నిందితుడి జేబులో లేఖ ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే ఆ లేఖలో ముగ్గురి రాత ఉండటంతో ఆలేఖను ఎవరు నమ్మటం లేదు. ఓ పిచ్చి ఫ్లెక్సీని టిడిపి నేతలు తెరపైకి తెచ్చారు. అయితే ఆ ఫ్లెక్సీలో పసుపు రంగుండటంతో పాటు రెండు సార్లు చూపించిన ఫ్లెక్సీలు కూడా తేడాలుండటంతో ఆ ఫ్లెక్సీలు కూడా అప్పటికప్పుడు టిడిపి సృష్టించినవే అని తేలిపోయింది. నిందితుడు వైసిపి మనిషే అనికానీ జగన్ అభిమానే అనేందుకు కానీ ఏ విధమైన ఆధారాలను టిడిపి చూపలేకపోయింది.

అదే సమయంలో తాజాగా వైసిపి మాత్రం నిందితుడు టిడిపి సభ్యుడే అని రుజువుగా  ఓ గుర్తింపుకార్డును బయటపెట్టింది. నిందితునితో పాటు అతని సోదరుని గుర్తింపుకార్డు కూడా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. మరి ఇపుడు టిడిపి నేతలు ఏమి సమాధానం చెబుతారో చూడాలి. గుర్తింపుకార్డును చూపిన తర్వాత కూడా శ్రీనివాస్ టిడిపి సభ్యుడు కాదని అంటారా ? లేకపోతే  ఆ గుర్తింకార్డును వైసిపి సృష్టించిందని ఎదురుదాడి చేస్తారో చూడాలి. విచిత్రమేమిటంటే, జగన్ పై దాడిచేసిన శ్రీనివాస్ కు టిడిపికి ఏమీ సబంధం లేదని చెప్పటానికి టిడిపి నేతలకన్నా టిడిపికి మద్దతుగా నిలబడే మీడియానే ఎక్కువ తాపత్రయపడుతోంది.