విశాఖలో భరత్ కు వెన్నుపోటు పొడిచారా  

అవుననే అంటున్నారు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. విశాఖపట్నం పార్లమెంటు స్ధానంలో పోటీ చేసిన జనసేన అభ్యర్ధి జెడి లక్ష్మీనారాయణను గెలిపించేందుకని చంద్రబాబునాయుడు, నారా లోకేష్ దగ్గరి బంధువు శ్రీ భరత్ కు వెన్నుపోటు పొడిచినట్లు చెబుతున్నారు.

జేడిని ఉద్దేశించి విజయసాయి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ విశాఖపట్నం పార్లమెంటులో శ్రీ భరత్ కు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి చంద్రబాబు, లోకేష్ మద్దతు మాత్రం మీకివ్వమని టిడిపి నేతలకు చెప్పింది నిజం కాదా అంటూ నిలదీశారు. లోకేష్, శ్రీ భరత్ ఇద్దరు కూడా నందమూరి బాలకృష్ణకు అల్లుళ్ళన్న సంగతి అందరికీ తెలిసిందే.

భరత్ ను ఓడిగొట్టేందుకని చంద్రబాబు జనసేన అభ్యర్ధికి లక్ష్మీనారాయణకు ఓట్లేయించినట్లు జనాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. అదే విషయాన్ని బహుశా విజయసాయి కూడా ట్విట్టర్ లో చెప్పినట్లున్నారు. తండ్రి కొడుకులిద్దరు కలిసి ఓట్లను చీల్చి జనాలను వెర్రి పుష్పాలను చేసేందుకు వేర్వేరుగా పోటీ చేసినట్లు రాజ్యసభ సభ్యుడు ఆరోపించారు.

మొత్తంమీద విజయసాయి కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ఇటు చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్ ను కూడా వాయించేస్తున్నారు. ఇదే క్రమంలో లక్ష్మీనారాయణను కూడా టార్గెట్ చేస్తున్నారు. కారణాలు తెలీదు కానీ కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం విజయసాయిరెడ్డి వదిలిపెట్టినట్లే ఉన్నారు.