కాపు ఉద్యమ నేతగా పాపులరైన ముద్రగడ పద్మనాభం తెలుగుదేశంపార్టీలో చేరబోతున్నారా ? టిడిపి వర్గాలు అవుననే అంటున్నాయి. చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు కొందరు పార్టీ నేతలు ముద్రగడతో భేటీ అయ్యారు. టిడిపిలో చేరాల్సిందిగా చంద్రబాబు తరపున ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టికెట్ ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం పిఠాపురంలో సిట్టింగ్ ఎంఎల్ఏ వర్మ ఉన్నారు.
అయితే, మొదటిజాబితాలో వర్మ పేరు ప్రకటించకుండా చంద్రబాబు పెండింగ్ పెట్టారు. బహుశా ముద్రగడ కోసమే వర్మకు టికెట్ ప్రకటించకుండా పెండింగ్ పెట్టారని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయ్. అయితే ఇదే విషయమై ముద్రగడ మాట్లాడుతూ తనకు మాత్రమే కాకుండా కాపు జేఏసి నేతల్లో కూడా కొందరికి టికెట్లు ఇవ్వాలని షరతు పెట్టారు. దాంతో ఏమీ మాట్లాడకుండా టిడిపి నేతలు వెనక్కు వెళ్ళిపోయారు. ముద్రగడతో ఎప్పుడూ ఇదే సమస్య.
తనను ఎక్కడికైనా పిలిస్తే తనతో పాటు అందరినీ తీసుకొస్తానని షరతు పెడుతుంటారు. ఇపుడు కూడా అలాంటి షరతే పెట్టారు. నిజానికి ముద్రగడకు టికెట్ ఇవ్వటమే దండగ. అలాంటిది ఆయన మద్దతుదారులకు కూడా అంటే చంద్రబాబు ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే, ముద్రగడకు కాపుల్లో పెద్ద పట్టేమీ లేదన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఏదో లేస్తే మనిషిని కాదన్నట్లుగా నెట్టుకొచ్చేస్తున్నారు. రాష్ట్రమంతటా ముద్రగడను తిప్పించి జగన్మోహన్ రెడ్డికి తిట్టించాలన్నది చంద్రబాబు ఆలోచన.
ముద్రగడ ఓట్లు వేయమంటే వేసే కాపులు లేరు. ఓట్లు వెయ్యందంటే ఆగిపోయేవారూ లేరు. కాకపోతే మీడియాలో బాగా ఫోకస్ అయ్యారు కాబట్టి కాపు ఉద్యమం అనగానే ముందుగా ముద్రగడ మాత్రమే గుర్తుకొస్తారు. అసలు ముద్రగడ కుటుంబం విషయంలో చంద్రబాబు ఎంత అమానుషంగా ప్రవర్తించారో అందరూ చూసిందే. కాపు ఉద్యమంలో ఇదే ముద్రగడ అదే చంద్రబాబును తిట్టినతిట్లు అందరికీ తెలిసిందే. అలాంటిది ఇపుడు ముద్రగడే టిడిపిలో చేరుతానంటే ముద్రగడకు ఇంతకన్నా అవమానం ఇంకోటుంటుందా ?
