జగన్ మౌనమే చంద్రబాబును రెచ్చ గొడుతోందా ?

చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒకరిని మరొకరు తీవ్రంగా దూషించుకున్నారు.  ఒకరిపై మరొకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకున్నారు. సరే అదంతా అయిపోయింది. పోలింగ్ కూడా జరిగిపోయింది. తన ఓటేసేసిన జగన్ వెళ్ళి లోటస్ పాండ్ లో కూర్చున్నారు. అప్పటి నుండి మొన్న గవర్నర్ ను కలిసి టిడిపి దాడులపై ఫిర్యాదు చేసే వరకూ ఎవరితోను మాట్లాడలేదు.

కానీ చంద్రబాబు మాత్రం ఓటు వేసి వచ్చిన దగ్గర నుండి ఒకటే గోల చేస్తున్నారు. ముందు కేంద్రంతో గొడవపడ్డారు. తర్వాత ప్రచారం సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్, జగన్, మోడి జోడి అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. పోలింగ్ రోజు నుండి ఈవిఎంల పనితీరుపై ఎన్నికల కమీషన్ ను తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ప్రతీరోజు ఈవిఎంలను, జగన్ ను విమర్శిస్తునే ఉన్నారు.

ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే జగన్ మౌనమే చంద్రబాబును బాగా రెచ్చగొడుతోందా అన్న అనుమానం మొదలైంది. అధికారంలోకి రాబోయేది తామే అన్న నమ్మకం ఉన్న జగన్ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే సమయంలో టిడిపికి ఓటమి తప్పదనే సంకేతాలను చంద్రబాబే స్వయంగా జనాల్లోకి పంపారు. అంటే గెలుపుపైన కానీ ఈవిఎంల పనితీరుపైన కానీ జగన్ ఎక్కడా స్టేట్ మెంట్ ఇవ్వలేదు. మరి అయినా చంద్రబాబు ఎందుకు రెచ్చిపోతున్నారో అర్ధం కావటం లేదు. పైగా ఎన్నికల సంఘంపైన, ఈవిఎంలపైన జగన్ ఎందుకు మాట్లాడటం లేదంటూ విచిత్రంగా వాదిస్తున్నారు.