“చదువురానివాడు కాకరకాయ అంటే, చదువుకున్నవాడు కీకరకాయ అన్నాడట” అనేది ఒక తెలుగు సామెత. అంటే… చదువుకున్నామనే గర్వంతో, తమకు అన్నీ తెలుసనే అర్ధజ్ఞానంతో అజ్ఞానంగా మాట్లాడే వారిని ఉద్దేశించి ఈ సామెతను తరచుగా వాడుతుంటారు. ఇప్పుడు ఈ సామెత ప్రస్థావన ఎందుకంటే.. తాజాగా మధ్యాహ్నం భోజనం పథకం, విద్యావ్యవస్థలో ప్రభుత్వాల బాధ్యతతో పాటు స్థోమత లేనివారు చదువుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు వ్యాఖ్యానించారు.
తాజాగా తన ప్రసంగంలో భాగంగా… “ఉసిరి కాయ పచ్చడి, మజ్జిగ అన్నం తిని నాలుగు వేధాలు కంఠస్తం చేసినవారు ఉన్నారు.. వారికి చదువు ముఖ్యం, తిండి ముఖ్యం కాదు. ఇవాళ మధ్యాహ్న భోజనం ముఖ్యమైపోయింది.. చదువు ఎవడికీ అక్కర్లే. భోజనంలో గుడ్డు పెట్టారా, గాడిద గుడ్డు పెట్టారా..? అన్నం తినేవాడికి కోడి గుడ్డు పెట్టడం ఏమిటండి.. బుద్దుందా లేదా?.. చదివితే చదువుకోమని చెప్పండి లేకపోతే వెళ్లిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావా నువ్వు..?” అంటూ మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి వ్యాఖ్యానించారు.
ఇంకా చాలానే వ్యాఖ్యలు చేస్తూ.. ఉత్తమ విద్యను అందించడమే ప్రభుత్వాల బాధ్యత తప్ప, మధ్యాహ్నం భోజనం పెట్టడం కాదని తనదైన జ్ఞానాన్ని ప్రదర్శించారు! దీంతో… పేద ప్రజల పరిస్థితులు సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన గరికపాటికి తెలియదా..? లేక, ప్రస్తుతం తానున్న స్థితిలో మరిచిపోయారా..? పేద వాడు చదువుకోవాలంటే ప్రభుత్వం నుంచి ఆ మాత్రం మద్దతు అందకూడదని సహస్రావధాని కోరుకోవడాన్ని ఎలా చూడాలి..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గరికపాటి నరసింహరావుకి సామాన్యుల నుంచి పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో భాగంగా… ఉసిరికాయ పచ్చడి, మజ్జిగ అన్నం తిని వేధాలు కంఠస్తం చేసినవారే కాదు.. కేవలం గంజినీళ్లు తాగి, వీధి లైట్ల కింద కూర్చుని, కిరోసిన్ దీపాల ముందుండి చదువుకుని దేశంలోనే చాలా గొప్పవారిగా మారినవారూ ఉన్నారు. మీ గతం ఏమిటో కూడా మీకు తెలియంది కాదు! అలా అని స్థోమత లేనివారందరినీ ఈ రోజుల్లో కూడా అలానే చదువుకోమని చెబుదామా..? పేదవాడు చదువుకు దూరంగానే జీవించాలా.. ఆర్థిక స్థోమత ఉంటేనే మీ భాషలో సరస్వతికి పుత్రుడు అవ్వాలా..?
అసలు ఈ మధ్యాహ్న భోజన పథకం వెనుక ఎంత గొప్ప ఆలోచన ఉందనే విషయం పండితునికి అర్థం కాకపోతే ఎలా..? తన పిల్లలను స్కూల్ కి పంపాలంటే పుస్తకాలు కొనాలి, బ్యాగ్ కొనాలి, బట్టలు కొనాలి, మధ్యాహ్నానికి అన్నం వండి పంపించాలి.. ఇది తమకు సాధ్యం కాదనకుంటూనే.. అందరి పిల్లల్లా తమ పిల్లలూ చదువుకోవాలని కోరుకునే ప్రతీ తల్లితండ్రికీ ఈ పథకం మీ భాషలో ఓ అద్భుతమైన వరం కాదనుకుంటున్నారా మాజీ ఉపాధ్యాయుడు..? అని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు!
ఇక కోడిగుడ్డు గురించి వైద్యులు చెప్పే విషయాలు గరికపాటి దృష్టికి రాలేదా అనేది మరో సందేహం. కోడిగుడ్డులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయని.. దీనిలో విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయని.. ఇక చిన్న పిల్లలకు నాటు కోడి గుడ్డు పెట్టడం మంచిదని.. ఇవి పిల్లల్లో వచ్చే అనేక సమస్యల నుంచి కాపాడతాయని చెబుతున్నారనే విషయం కూడా ఈ మేధావికి తెలియదా..? అని ఆయన అభిమానులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు!
కాగా… పేదవాడికి విద్య అందని ద్రాక్ష కాకూడదు.. పుస్తకాలు కొనుక్కునే స్థోమత లేకో, తాను చిన్న వయసులోనే పనికి పోకపోతే భోజనం దొరకదనే కారణం తోనో, ఎంతోమంది పేద బాలబాలికల పరిస్థితి “బాల కార్మికులు”గా మారిపోతున్న స్థితి. ఇది ఎంతోకాలంగా దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. ఈ సమయంలో మధ్యాహ్న భోజన పథకం తెరపైకి వచ్చింది. ఏపీలో జగన్ సర్కార్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వీక్లీ ఫుడ్ మెనూ అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు మధ్యాహ్నం మంచి భోజనం, పోషకాలతో కూడిన ఆహారం అందించారు. తాజా ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుంది!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరో అడుగు ముందుకు వేశారు. ఇందులో భాగంగా… పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు స్కూలు పుస్తకాలు, అవి పెట్టుకోవడానికి బ్యాగ్ తో పాటు స్కూల్ యూనిఫామ్, షూస్, సాక్సులు సైతం అందించి.. వారిలో ఇతరులను చూసి ఆత్మనూన్యత భావం కలగకుండా.. మరింత ఆత్మవిశ్వాసంతో చదువుకుంటూ ముందుకు వెళ్లేలా ప్రోత్సహించారు. దీనిపై అప్పట్లో పక్క రాష్ట్రాల నుంచి సైతం జగన్ సర్కార్ కు ప్రశంసలు లభించాయి. ఇది పేద కుటుంబాల పిల్లలకు ఎంతో, మరెంతో ఉపయుక్తంగా మారింది.
కట్ చేస్తే… 2024 ఎన్నికల సమయంలో జగన్ ప్రధానంగా ఒక విషయాన్ని ప్రస్థావించేవారు. ఏపీలో ఈ ఎన్నికల్లో జరిగేది క్యాస్ట్ వార్ కాదని, క్లాస్ వార్ అని.. ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే ప్రజాస్వామ్య యుద్ధమని నొక్కి చెప్పేవారు. అయితే వాటిని పలువురు వ్యూహాత్మకంగా పక్కదారి పట్టించడంవల్లో.. లేక, ఈ విషయం సామాన్యులకు స్వానుభవంలోకి వస్తే కాని అర్ధం కాదనే ప్రకృతి తలంపో తెలియదు కానీ.. ఫలితాలు జగన్ ఆశించినట్లు రాలేదు! అయితే.. ఆయన చెప్పిన “క్లాస్” వార్ అనే చర్చ మాత్రం తాజాగా గరికపాటి వ్యాఖ్యలతో తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో.. భేషజాలకు పోకుండా.. చేసిన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఫాలోవర్స్ పలువురు కోరుతున్నారు! అలాకాని పక్షంలో ఇది సమాజంలో చెడు సంకేతాలను పంపుతుందని.. కడుపు నిండివాడి కబుర్లు ఎప్పుడూ పేదవాడి కడుపు కొట్టేలా ఉండకూడదనే విషయాన్ని గ్రహించాలని పలువురు సూచిస్తున్నారు. ఇదే సమయంలో.. తాను ఏమి చెప్పినా తన అభిమానులు, అనుచరులు గుడ్డిగా నమ్ముతారని.. ఏ మాత్రం బుర్ర లేకుండా వినేస్తారనే ఆలోచనలు ఆయనకు రాకుండా చూడాలని వారు నమ్మే దేవుడికి కోరుకుంటున్నారని తెలుస్తోంది!
