అవుననే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముఠాలు కడుతున్నాడన్న కారణంగా చంద్రబాబును కొట్టబోయారట. కమ్మ, రెడ్డి అనే ముఠాలు కడుతు పార్టీలో గ్రూపులు తెస్తున్నాడని చెన్నారెడ్డికి బాగా కోపం వచ్చిందట. అదే విషయమై ఓ సమావేశంలో తన చేతిలోని స్టిక్ తో చంద్రబాబును కొట్టబోయారట కూడా. అయితే, అంతమంది ముందు ఓ ఎంఎల్ఏని కొట్టటం బావుండదని మళ్ళీ చెన్నారెడ్డే తమాయించుకున్నారట.
అదే విషయాన్ని విడిగా ఉన్నపుడు చెన్నారెడ్డిని తాను అడిగినపుడు పార్టీలో కమ్మ, రెడ్డి అంటూ గ్రూపులు కడుతున్నారని చంద్రబాబుపై చెన్నారెడ్డి మండిపడ్డారని నాదెండ్ల వివరించారు. గ్రూపులు కడుతున్న చంద్రబాబును ఎవరూ చేరదీయొద్దని కూడా తమకందరికీ చెన్నారెడ్డి ఆదేశాలిచ్చినట్లు కూడా నాదెండ్ల చెప్పటం గమనార్హం. తిరుపతి రైల్వే స్టేషన్లో చంద్రబాబుపై దొంగతనం చేసిన కేసు ఇంకా ఉందని నాదెండ్ల గతంలో చెప్పిన విషయానికి తాజాగా కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
ఈమధ్య ఎన్టీయార్ గురించి తాను చెప్పిన వన్నీ వాస్తవాలేనంటూ తన ఇంటర్వ్యూలను సమర్దించుకున్నారు. టిడిపి వ్యవస్ధాపకుడిని తానే అంటూ నాదెండ్ల మరోసారి గట్టిగా చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే తనను మంత్రిపదవి నుండి ఎన్టీయార్ తీసేశారని చెప్పారు. కాబట్టి సిఎంగా ఎన్టీయార్ ను తాను తొలగించినట్లు సమర్ధించుకున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాల్సిన అవసరమైతే ఉందన్నారు. అధికార మార్పిడి జరగకపోతే జనాలు తీవ్ర ఇబ్బందుల్లో పడటం ఖాయమని హెచ్చరించారు.
బిసిలకు తాను ఏదో చేసేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్న చంద్రబాబు మరి అదే బసిలకు చెందిన నరేంద్రమోడిని ప్రధానిగా దింపేయాలని చంద్రబాబు ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రశ్నించారు. తనను విలన్ గా చూపిస్తు ఎవరు సినిమా తీసినా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవటం తప్పదని కూడా నాదెండ్ల భాస్కరరావు హెచ్చరించారు.
