Simhachalam Wall Collapse: సింహాచల విషాదంపై విచారణ కమిటీ ఏర్పాటు.. బాధ్యులపై కఠిన చర్యలు?

సింహాచలం చందనోత్సవం రోజు జరిగిన గోడ కూలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. భక్తుల ప్రాణాలను బలిగొన్న దుర్ఘటనకు గల అసలు కారణాలు కనుగొని, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీకి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ నాయకత్వం వహించనున్నారు. ఆయనతోపాటు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావు సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీకి సివిల్ కోర్టు అధికారాలను కూడా ప్రభుత్వం అప్పగించింది. అంటే, సాక్ష్యాలను సేకరించడం, విచారణ నిమిత్తం పిలుపునివ్వడం వంటి పూర్తి అధికారాలతో ఈ కమిషన్ పని చేయనుంది.

ప్రమాదానికి గల అసలు కారణం నిర్మాణంలో నాణ్యత లోపమా? లేక నిర్వాహకుల నిర్లక్ష్యమా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అనుమతులుళ్ల నిర్మాణమేనా? టికెట్ క్యూలైన్ వద్ద భద్రతా చర్యలు తీసుకున్నారా? అనే ప్రశ్నలకు సమాధానం వెతకనుంది ఈ కమిటీ. త్వరితగతిన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే మరణించిన ప్రతి భక్తుని కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ. 3 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని దేవాదాయ శాఖకు సూచించారు. బాధితుల పట్ల ప్రభుత్వం సహానుభూతి చూపిస్తూనే, ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలకు కూడా సిద్ధమవుతోంది.

కూటమి చేతకానితనం || Ysrcp Leader Fires On Government Over Simhachalam Temple Incident || TR