ఎన్టీఆర్ బొమ్మతో చెల్లని నాణెం… తెరవెనుక వ్యూహం ఇదే!

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా స్మారక నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి ఎన్ టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీడీపీ నేతలు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ నేతలు హాజరయ్యారు. అయితే అసలు అర్హురాలైన తనను ఆహ్వానించలేదంటూ లక్ష్మీ పార్వతి ఫైరవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు చంద్రబాబుకు ఎన్ టీఆర్(NTR) గుర్తుకువస్తారని ఎద్దేవా చేసిన లక్ష్మీపార్వతి… తమ స్వార్ధరాజకీయ ప్రయోజనాలకోసం ఎన్టీఆర్ పేరున 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారంటూ ఫైరయ్యారు. పురందేశ్వరి, చంద్రబాబు… ఇద్దరూ మాట్లాడుకునే ఈ నాణెం అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి.. భారతరత్నను పక్కకు తప్పించారని.. ఆ విధంగా ఎన్టీఆర్ కు మరోసారి వెన్నుపోటు పొడిచారని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, ఎన్టీఆర్ పేరున విడుదల చేసిన 100 రూపాయల క్వాయిన్ ని “చెల్లని నాణెం” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తుంటే ఎంతో బాధగా ఉందని చెప్పిన ఆమె… ఎన్టీఆర్ బొమ్మ ఉన్న నాణెం చెల్లని నాణెం అంటూ ఎగతాలి చేస్తుంటే.. ఎంతో ఆవేదనగా ఉందని అన్నారు. ఆ నాణెం చెలామణిలో ఉండేది అయితే పర్లేదు కానీ… నాలువేలకు పైగా డబ్బు చెల్లిస్తే ఆ నాణెం ఇవ్వడం.. ఆఖరికి ఆయనను ఈ రకంగా కూడా వ్యాపారాన్నికి ఉపయోగిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా… ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఇప్పటికే పురందేశ్వరిపై లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ఫైరయిన సంగతి తెలిసిందే. తనను ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారా లేదా అనే విషయం ఆయన కుటుంబ సభ్యులు చెప్పాలని లక్ష్మీపార్వతి సూటిగా ప్రశ్నించారు.

తమ వివాహంపై అన్ని పత్రికలు రాశాయని.. ఇలా ఇంకా ఎన్నిసార్లు తనను అవమానిస్తారని ఆమె నిలదీశారు. తాను ఎన్టీఆర్ భార్య అని బోర్డ్ కట్టుకుని తిరగలా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తనను ఎన్టీఆర్ ఇల్లిగల్ గా పెట్టుకున్నారా అని కూడా లక్ష్మీపార్వతి అడిగారు. ఒకవేళ తనను ఇల్లీగల్ గా పెట్టుకుంటే… అప్పుడు ఎన్టీఆర్ ఎలా యుగపురుషుడు అవుతాడంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు.

అదేవిధంగా… ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిని, చంద్రబాబుని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే వరకు వైసీపీ తరపున ప్రచారం చేస్తానని లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. చంద్రబాబు – పురందేశ్వరి ఏకం అయ్యారని.. ఏదో ఒక రోజు పురందేశ్వరి తన కన్నా ఎక్కువ అవమానాలకు గురి అవుతుందని లక్ష్మీపార్వతి శాపనార్ధాలు పెట్టారు! కేంద్రం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి అనుకుంటే అడ్డుకున్నది పురందేశ్వరే అని సంచలన ఆరోపణలు చేశారు