ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ముహూర్తాలు, వారాలు, వర్జ్యాల గురించి ఇంకా పూర్తి సమాచారం లేకపోయినా.. త్వరలో ఆయన లోటస్ పాండ్ కు రానున్నారని.. ఇకపై బెంగళూరు వైపు కాకుండా.. తాడేపల్లి – హైదరాబాద్ లలోనే ఎక్కువగా ఉండనున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా మూడు ఆసక్తికర విషయాలపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు మీడియా సర్కిల్స్ లోనూ చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండగా.. ప్రధానంగా తొలినాళ్లల్లో అన్నింటికీ సాక్ష్యంగా నిలిచింది లోటస్ పాండ్. వైఎస్సార్ భౌతికంగా అస్తమించిన తర్వాత నుంచి.. ఆయన సమకాలికులు, సన్నిహితులు, సహచరులు, స్నేహితులు, శ్రేయోభిలాషులంతా జగన్ లో ఆయనను చూసుకుంటూ.. లోటస్ పాండ్ లో చర్చలు జరిపేవారు. వారికి తోచిన సలహాలు, సూచనలూ చేసేవారు. అది జగన్ పొలిటికల్ కెరీర్ లో అత్యంత కీలక సమయం అని అంటారు.
కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన జగన్.. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం కావడంతో హైదరాబాద్ నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించారు. అలా వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు “లోటస్ పాండ్” తో అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది.. అది పెద్ద సెంటిమెంట్ గానూ మారిపోయిన పరిస్థితి. ఆ తదనంతరం 2014లో ప్రతిపక్షంలోకి వచ్చినా.. ఎక్కువగా లోటస్ పాండ్ ను విడిచిపెట్టలేదు.
తన తండ్రి సహచరులతో పాటు వైసీపీలోని కీలక నాయకులతో అక్కడి నుంచి రాజకీయ చర్చలు జరుపుతూ వ్యూహాలు అమలు చేశారు. 2019లో రికార్డ్ స్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. వాస్తవానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఏపీకి హక్కు ఉన్నప్పటికీ అప్పటి నోటుకు ఓటు వంటి కారణాలతో హైదరాబాద్ ను ఖాళీ చేసి చంద్రబాబు వెళ్లిపోయారని అప్పట్లో ప్రచారం నడిచింది.
ఏది ఏమైనా… ఏపీలో ఫుల్ సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా మారినప్పటి నుంచి జగన్ ఇక పూర్తిగా తాడేపల్లి లోని నివాసానికే పరిమితమయ్యారు. అప్పుడప్పుడూ బెంగళూరు, అప్పుడప్పుడూ కడప వెళ్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే… జగన్ బెంగళూరు వెళ్లినప్పుడల్లా ఆయనపై ఓ వర్గం మీడియా, రాజకీయ ప్రత్యర్థులు రకరకాల విమర్శలు చేసేవారు. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి వీకెండ్స్ లో కుటుంబంతో కలిసి ఎక్కడికి వెళ్తే వాళ్లకెందుకు అని వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యేవారు.
మరికొంతమంది సీనియర్లు అయితే… 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు, లోకేష్ అసలు హైదరాబాద్ ని విడిచి ఏపీలోనే అడుగుపెట్టలేదుగా అని ఎదురు ప్రశ్నించేవారు. కట్ చేస్తే.. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. జగన్ తాడేపల్లి నివాసంలోనే ఉంటూ అటు నేతలకు, కార్యకర్తలకు, సమాన్యులకు అందుబాటులో ఉంటూ.. అప్పుడప్పుడూ బెంగళూరు వెళ్లి వస్తున్నారు. అయితే… ఇకపై కర్ణాటక రూటు కాస్తా పూర్తిగా తెలంగాణ వైపు మళ్లనుందని.. లోటస్ పాండ్ లో అందుబాటులో ఉండనున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో మూడు రకాల విషయాలు చర్చకు వస్తున్నాయి. ఇందులో భాగంగా… జగన్ బెంగళూరు వెళ్లినప్పుడల్లా ఆయనపై రకరకాల విమర్శలు చేస్తోన్న వారికి చెక్ పెట్టినట్లు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలా అని వీకెండ్స్ లో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ వెళ్లిన ప్రాంతానికే జగన్ వెళ్లాలని కాదు కానీ.. పరిస్థితులు అలా మారిపోయిన పరిస్థితి! పైగా… వైసీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు రకరకాల కారణాలతో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండటం వల్ల.. వారికీ అందుబాటులో ఉన్నట్లు ఉంటుందని చెబుతున్నారు.
మరోవైపు… సెంటిమెంట్ పరంగా ఆలోచించినా… జగన్ కు లోటస్ పాండ్ లో ఉన్న సమయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. అంతకు మించిన కీర్తిని తెచ్చిపెట్టిందని అంటున్నారు. వారంలో ఎన్నో కొన్ని రోజులు హైదరాబాద్ లో కూడా అందుబాటులో ఉండటం.. అన్ని రకాలుగానూ మేలు చేస్తుందని చెబుతున్నారు. కాస్త ఆలస్యం అయినా.. ఈ విషయంలో జగన్ తీసుకున్నట్లు చెబుతున్న నిర్ణయం పూర్తిగా ఆహ్వానించదగినదనేది ఆ పార్టీ జనాల నుంచి వినిపిస్తోన్నమాట.
ఇక జగన్ ఏమి చేసినా అందులో కోడి గుడ్డుపై ఈకలు పీకడం.. ఏ పని చేసినా అందులో రాజకీయ విమర్శలను, జనాల్లో సరికొత్త చర్చను లేపడం ఓ వర్గం మీడియాకు పరిపాటే కాబట్టి.. అప్పుడే ఆ తరహా కథనాలూ మొదలైపోయాయి. ఇందులో భాగంగా… తన స్నేహితులు, శ్రేయోభిలాషులు అయిన కేసీఆర్, కేటీఆర్ లకు సైతం వారానికి ఒకటి రెండు రోజులు అందుబాటులో ఉండి, వారితో మంతనాలు జరపడానికి కూడా వీలుండేలా జగన్ లోటస్ పాండ్ ను ఎంచుకున్నారని రాయడం మొదలు పెట్టేశారు.
ఏది ఏమైనా… మిత్రుడు సంతోషిస్తున్నాడనో, శత్రువు జంకుతున్నాడో, సెంటిమెంట్ అనో, అందరు నాయకులకూ అన్ని చోట్లా అందుబాటులో ఉండాలనో… కారణం ఏదైనా, కారకులు ఎవరైనా… జగన్ వారంలో కొన్ని రోజులు హైదరాబాద్ లో నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది కచ్చితంగా శుభపరిణామం అన్ని అంటున్నారు కార్యకర్తలు. దీంతో.. లోటస్ పాండ్ మళ్లీ వార్తల్లో నిలుస్తుందని.. జగన్ కు పూర్వవైభవం వస్తోందని చెబుతున్నారు!
