టిడిపిలో మిగిలేది ఎంతమంది ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందిరికీ అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబునాయుడుకు వయసైపోతోంది. నారా లోకేష్ నాయకత్వంపై నమ్మకం కోల్పోవటంతో పాటు రాజకీయ భవిష్యత్తుపై టిడిపి నేతల్లో అయోమయం పెరిగిపోతోంది.

మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున  గెలిచిందే 23 మంది ఎంఎల్ఏలు. వారిలో పార్టీపై అభిమానం ఉన్నవారి కన్నా పదవులపై అభిమానం ఉన్నవారే ఎక్కువమంది. అందుకనే టిడిపిలో ఉండలేక వైసిపి లేకపోతే బిజెపి వైపు చూస్తున్నారన్నది వాస్తవం.

వైసిపి నేతల సమాచారం ప్రకారం 23 మంది ఎంఎల్ఏల్లో కనీసం 10 మంది వైసిపిలో చేరేందుకు రెడీగా ఉన్నారు. అదే సమయంలో తమ పార్టీతో 18 మంది ఎంఎల్ఏలు టచ్ లో ఉన్నట్లు బిజెపి నేతలు చెబుతున్నారు. రెండింటిలో ఏది జరిగినా చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ప్రధాన ప్రతిపక్ష హోదా విషయం పక్కనపెట్టేస్తే అసలు టిడిపి మనుగడకే సమస్య అయ్యేట్లుంది.

చంద్రబాబు, టిడిపి పరిస్ధితిని పక్కన పెట్టేస్తే ఎవరికి వారుగా టిడిపిని వదిలేసి తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు, చినబాబును ముంచేసి చాలామంది నేతలు ఇతర పార్టీలో చేరిపోవటం ఖాయంగానే తోస్తోంది. చూడబోతే టిడిపిలో ఎంతమంది ఎంఎల్ఏలుంటారనే విషయంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి.