తెలంగాణ సర్కార్ కు హైకోర్టు షాక్

తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో కనీస నిబంధనలు పాటించకుండా ఉద్యోగాల భర్తీ చేయడం పై సర్కార్ ను నిలదీసింది. 9355 పోస్టుల నియామక ప్రక్రియలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా అంటూ తెలంగాణ సర్కార్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. సర్టిఫికేట్ల ప్రక్రియ పూర్తి చేయాలని కానీ నియామక ఉత్తర్వులు మాత్రం ఇవ్వవద్దని స్పష్టం చేసింది. అసలు వివరాలు ఏంటంటే…

తెలంగాణలో 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి రాత పరీక్ష పూర్తి చేశారు. అయితే కీ పేపర్ , మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే నేరుగా ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలు జిల్లా కలెక్టర్లకు పంపించారు. దీంతో పంచాయతీరాజ్ అభ్యర్దులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీస నిబంధనలకు విరుద్దంగా నియామక ప్రక్రియ కొనసాగుతుందని నియామక ప్రక్రియ పై అనుమానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్న పత్రం ఇవ్వలేదని, కీ పేపర్ ప్రకటించలేదని.. ప్రకటించినా సమాధానాలు చూసుకునే పరిస్థితి లేదన్నారు. పంచాయతీరాజ్ వెబ్ సైట్ లో పెట్టిన ప్రశ్నాపత్రం కీ లో కూడా చాలా తప్పులున్నాయని పిటిషనర్ లు న్యాయమూర్తికి తెలిపారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా నియామకపు ప్రక్రియ కొనసాగిస్తుందన్నారు.  

 

దీంతో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లికి చెందిన బి. హరీష్ కుమార్ తో పాటు మరికొంత మంది బుధవారం హైకోర్టులో అత్యవకర పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ రాంచందర్ రావు విచారణ చేపట్టారు. ప్రాథమిక కీ పై 70 వేల అభ్యంతరాలు వచ్చాయని, ఒకే జిల్లాలో లిస్ట్ లో వచ్చిన హాల్ టికెట్ నంబరే మూడు సార్లు వచ్చిందని పిటిషనర్ న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.

మోదీ నాయకత్వంపై అనుమానాలు మొదలయ్యాయి… చదవండి

జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత మంది ఎంపికయ్యారు, రిజర్వేషన్ల ప్రక్రియ ఏ విధంగా తీశారు. ఎన్ని మార్కులు వస్తే ఎంపికవుతారు అనే వివరాలేవి కూడా తెలియడం లేదని ఆయన న్యాయమూర్తికి తెలిపారు. రిజర్వేషన్లు 50 శాతం మించడానికి వీల్లేదని నిబంధనలు ఉన్నప్పటికి జనరల్ అభ్యర్దులకు 45 శాతం, రిజర్వ్ డ్ అభ్యర్దులకు 55 శాతం రిజర్వేషన్లు కల్పించారని వివరించారు.  

ఇదే సమయంలో ప్రభుత్వం తరపున అదనపు ఏజీ రామచందర్ రావు కలగజేసుకొని జెపీఎస్ ప్రక్రియ దాదాపు అయిపోయిందని సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ఈ సమయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వరాదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.  దీంతో స్పందించిన న్యాయమూర్తి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం కావాలని స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు విరుద్దంగా ఉందన్నారు. కనీస నిబంధనలు పాటించకుండా నియామకాలు ఎలా చేస్తారని న్యాయమూర్తి అదనపు ఏజీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసుకోవచ్చని, తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అభ్యర్దులకు నియామక ఉత్తర్వులు ఇవ్వరాదని తేల్చి చెప్పారు.  ప్రతి వాదులుగా ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్వి తో పాటు ఇతరులకు నోటిసులు అందజేశారు.  దీంతో పంచాయతీరాజ్ నియామక ప్రక్రియ తాత్కాలిక వాయిదా పడింది. 

నాలుగున్నరేళ్ల తొలి తెలంగాణ ప్రభుత్వంలో అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యాయి. కనీస నిబంధనలు లేకుండా నోటిఫికేషన్లు వేయడంతో అభ్యర్ధులు కోర్టులను  ఆశ్రయించారు. అప్పుడు కోర్టు ప్రభుత్వానికి నోటిసులు అందజేస్తూ నియామక ప్రక్రియను వాయిదా వేసింది. కొత్తగా కొలువు తీరిన తెలంగాణ సర్కార్ కు కూడా ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలిందని నిరుద్యోగులు అంటున్నారు. ఈ సారైనా  ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసి పారదర్శకంగా నియామకాలు చేపడుతుందా లేక ఈ సారి కూడా కోర్టుల చుట్టే తిరుగుతుందా అని నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అయినా రెండో ప్రభుత్వం పూర్తిగా కుదురుకోకముందే సర్కార్ కు పంచాయతీ కార్యదర్శుల నియామకం పై  హైకోర్టు ఝలక్కిచ్చిందని నిరుద్యోగులు చర్చించుకుంటున్నారు.