ఆంధ్రా నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 20వేల పోస్టులు

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రా నిరుద్యోగ అభ్యర్థులకు చంద్రబాబు సర్కారు శుభవార్త చెప్పింది. త్వరలోనే 20వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ భారీ నియామకాలు చేపట్టేందుకు ఎపి సర్కారు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సీ, పోలీసు శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తం భర్తీ చేయనున్న పోస్టులు 20,010. పోస్టుల భర్తీ  ఫైలు మీద ఎపి సిఎం చంద్రబాబు సంతకం చేశారు.

ఈ పోస్టులను ఎపిపిఎస్సీ, డిఎస్సీల ద్వారా భర్తీ చేయనున్నారు. మరికొద్ది రోజుల్లోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ లు వెలువడతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎపిలో టిడిపి అధికారంలోకి వచ్చి తర్వాత పదివేల ఉపాధ్యాయ పోస్టులతో ఎపి సర్కారు ఒక డిఎస్సి నిర్వహించింది. రెండో డిఎస్సీ కి కూడా ప్రకటన వచ్చింది. రెండో డిఎస్సీ ద్వారా మరో పదివేల పోస్టుల భర్తీ త్వరలోనే పూర్తి అవుతుందని టిడిపి వర్గాలు తెలిపాయి.