టిడిపి గెలవటం చారిత్రకావసరం…ఎవరికి ?

చంద్రబాబునాయుడు మాటలు విచిత్రంగా ఉంటాయి. ‘ మీరేం భయపడకండి మీకు నేనున్నాను, నా చుట్టూ పడుకోండి’ అన్నట్లు మాట్లాడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలవటం చారిత్రక అవసరమట. అంతటి చారిత్రక అవసరం ఏమిటో మాత్రం చెప్పలేదు. అసలు టిడిపి గెలవటం ఎవరికి అవసరం ? చంద్రబాబుకా ? లేకపోతే రాష్ట్రానికా ? రాష్ట్రానికైతే చంద్రబాబును మళ్ళీ గెలిపించాల్సిన అవసరం లేదు. కాబట్టి టిడిపి మళ్ళీ గెలవటం చంద్రబాబుకే ఎక్కువ అవసరం.

ఎలాగంటే, పోయిన ఎన్నికల్లో వందలాది హామీలిచ్చి జనాలను మాయచేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. పైగా నాలుగున్నరేళ్ళ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి భారీగా  అవినీతి జరిగిందని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్ధారించింది. చంద్రబాబు పాలనలో ఒక్క సొంత సామాజికవర్గంలోని కొందరు తప్ప మిగిలిన సామాజికవర్గాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది.

ఇక, మంత్రులు, ఎంఎల్ఏలు, నేతల అవినీతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. శాంతి భద్రతలు గాలికొదిలేశారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయి. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో చాలామంది టిడిపి ప్రజా ప్రతినిధులున్నా ఒక్కళ్ళపైన కూడా చర్యలు లేవు. తప్పుడు హామీలిచ్చి ఇటు జనాలను మోసం చేయటంతో పాటు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టినట్లు స్వయంగా ప్రధానమంత్రే చెప్పారు. ఇక అభివృద్ధిపై చంద్రబాబు చెబుతున్న అబద్దాలు అన్నీ ఇన్నీ కావు.

చంద్రబాబు విధానాలు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటున్నాయి. మళ్ళీ చంద్రబాబే గెలిస్తే రాష్ట్రాన్ని ఒకవిధంగా సింగపూర్ కు రాసిచ్చేస్తారనే భయం ప్రజల్లో బాగా కనబడతోంది. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా అరాచకమే కనబడుతోంది. సర్వ వ్యవస్దలను చంద్రబాబు భ్రష్టుపట్టించేసిన చంద్రబాబు రెండోసారి సిఎం అయితే ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరమే లేదు. రేపటి ఎన్నికల్లో కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తనతో పాటు పుత్రరత్నం లోకేష్ భవిష్యత్తుకు ఇబ్బందులన్న ఏకైకా ఆందోళనతోనే టిడిపి గెలవటం చారిత్రకావసరమంటూ సొల్లు చెబుతున్నారు.