రాజకీయ పార్టీలకు ఎన్నికల నామ సంవత్సర శుభాకాంక్షలు …

 (యనమల నాగిరెడ్డి)

త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో “కోటి కోరికలతో అస్త్రశస్త్రాలను సిద్దంచేసుకుని “ ప్రజలకు కోకొల్లలుగా హామీలిచ్చి, వారిని ఆశల (ఉహల) పల్లకిలో ఉరేగిస్తూ ఇప్పటికే ఎన్నికల రణరంగంలో దిగిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు 2019 ఎన్నికల నామ సంవత్సరం ఎలాంటి ఫలితం ఇస్తుందో, వీరి ఆశలు ఏ మాత్రం తీరగలవో కాలమే తేల్చాల్సి ఉంది.

ఇక ఎపి పరిస్థితి గమనిస్తే ఇటు బాబుగారు, అటు జగన్ గారు, మధ్యలో పవన్ గారు జనాన్ని హామీల వర్షంలో ముంచి తేలుస్తున్నారు. ఈ ఎన్నికల హామీల సునామీలో ప్రజలు కొట్టుకొని పోతారా? లేక ఏమైనా లభ్ది పొందగలరా? అన్నది వచ్చే 5 సంవత్సరాలు తెలుస్తాయి. అన్ని పార్టీలకు, వారిని ఆనుసరిస్తున్న ప్రజలకు, అందలం ఎక్కాలనుకుంటున్న నాయకులకు “తెలుగు రాజ్యం .కామ్” ఎన్నికల నామసంవత్సర శుభాకాంక్షలు తెలియ చేస్తున్నది.

చంద్రబాబు నాయకత్వం లోని టీడీపీ

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ, బీజేపీని, జనసేనను మిత్ర పక్షాలుగా చేసుకొని 2014 ఎన్నికలలో గెలిచి అధికార పీఠం ఎక్కారు. ఆ ఎన్నికలలో రైతు రుణమాఫీ, ద్వాక్రా మహిళకు రుణమాఫీతో పాటు అనేక హామీలు గుప్పించి జనాన్ని మెప్పించ గలిగారు. అలాగే మోడీ నాయకత్వంలోని బీజేపీ ఈ రాష్టానికి “కుచ్చుల కుళాయి” పెడతామని హామీ ఇచ్చి ఆ తర్వాత “కుచ్చు టోపీ” పెట్టారు. మోడీ ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో, నాలుగేళ్లకు పైగా ఆయనతో కలసి ఉన్న చంద్రబాబు అంతకు మించిన ద్రోహం చేశారని చెప్పక తప్పదు. గోదావరి, కృష్ణ పుష్కరాల నిర్వహణ, రాజధానికి తాత్కాలిక నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం నుంచి, జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం ప్రాజెక్టును తన చేతిలోకి తీసుకోవడం, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా ప్రాజెక్టులు చేపట్టడం, కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఒకే ప్రాంతానికి కేటాయించడం చేశారు.

రాయలసీమకు….

“కూడు గుడ్డ అడగక పొతే కన్నతల్లిని, భార్యాబిడ్డలను మహారాణి లాగా చూసుకుంటానని” హామీ ఇచ్చాడట ఓ మహానుభావుడు. అలాగే చంద్రబాబుగారు కూడా “నీళ్లు, నిధులు, సంస్థలు , ప్రాజెక్టుల పూర్తి, ఈ కరువు ప్రాంతంలో జనం బ్రతికే అవకాశం కల్పించడం లాంటి అంశాల గురించి ఈ ప్రాంతవాసులు అడగకపోతే (తన జన్మభూమిని) అలాగే చూసుకుంటానని చేతలలో చూపారు. “ఏపీకి ప్యాకేజి ముద్దు ..లేదు లేదు హోదానే ముద్దు” అంటూ మరోసారి రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చి బీజేపీతో కలసి డ్రామా ఆడారు. వెనుకపడిన ప్రాంతాలకు రావలసిన(కేంద్రం ప్రకటించిన) ప్రత్యేక ప్యాకేజి విషయం అడగనేలేదు. రాయలసీమకు “తానెలాంటి సాయం చేయక పోగా, కేంద్రం ప్రాజెక్టలకు ఇచ్చిన సాయాన్ని ఒకే ప్రాంతానికి మళ్లించి”, తీరని అన్యాయం చేశారు. రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు గతంలో లాగా (1996 నుండి 2004 వరకు) కేటాయించిన విధంగానే నిధులు కేటాయిస్తూ పనులను నత్త నడకన సాగించారు. చివరి నిముషంలో కడప ఉక్కుకు శంఖు స్తాపన చేయడం, సీమకు హక్కుగా ఉన్న నీళ్లను “తన అస్మదీయులకు పంపి” కొన్ని నీళ్లు తెచ్చి గండికోటకు, పులివెందులకు ఇచ్చి జబ్బలు చరచుకుంటున్నారు. పోలవరం నీళ్లు సీమకే అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబు పాలనలో (1996-2004 మరియు 2014-2018) సీమకు మొండిచేయి చూపి, ప్రాజెక్టులను ప్రక్కన పెట్టి, ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేయడానికే మొగ్గుచూపారు.

వైస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి

వచ్చే ఎన్నికలలో గెలుపొంది ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న వైస్సార్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి 2014 ఎన్నికలలో ప్రజలు కట్టపెట్టిన భాద్యత పూర్తిగా విస్మరించారు. ప్రతిపక్షనేతగా ఆయన చేయవలసిన పనులను ప్రక్కన పెట్టి, “పుంఖాను పుంఖాలుగా హామీలు గుప్పిస్తూ” యాత్రలలో మునిగి తేలుతున్నారు.

“రాజధాని నిర్మాణ ప్రాంత ఎంపిక విషయంలో” చంద్రబాబు ఎత్తుకు జగన్ చిత్తయ్యారు. ‘దొనకొండ పేరుతొ కొంత డ్రామా ఆడిన (ఆడించిన) తర్వాత ముక్కుమూసుకొని అమరావతికి ఓటు వేశారు. అక్కడి రైతుల కొంప ముంచారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వంపై వత్తిడి తేవడానికి బదులు శాసనసభను బహిష్కరించి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేశారు. ప్రతి సమస్యకు “మనప్రభుత్వం వచ్చిన తర్వాత” పరిష్కరిస్తామని తారకమంత్రం పటిస్తున్నారు .

ఇకపోతే తన జన్మభూమి రాయలసీమ విషయానికి వస్తే ప్రాజెక్ట్ లకు నీళ్లు,నిధులు కేంద్ర ప్రభుత్వ సంస్థల కేటాయింపు, వెనుకపడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజి లాంటి విషయాలను అసలు పట్టించుకోకుండా “హోదా” భజన చేస్తున్నారు.

కాంగీయులు

అనేక దశాబ్దాలపాటు దేశాన్ని అప్రతిహతంగా పాలించి, శాసించి ప్రస్తుతం కుంటి నడక నడుస్తున్న కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి తన గొంతు విప్పడానికి యత్నిస్తున్నది. ఇన్ని దశాబ్దాలపాటు తనపై వ్యతిరేకతతో పుట్టిపెరిగిన ప్రాంతీయ పార్టీలను చీల్చి, చెండాడి, ప్రతిపక్షాల అనైక్యతే బలంగా రాజకీయాలను నడిపిన ఈ పార్టీ ప్రస్తుతం వారి దయాభిక్షపై ఆధారపడటానికి సిద్దపడుతున్నది.

రాజకీయ కారణాలను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ను (అసంబద్ధంగా) రెండుగా చీల్చడానికి , రాయలసీమ వెనుకబాటు తనానికి ప్రధాన కారణంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ (130 సంవత్సరాల ఇండస్ట్రీ ) ఏపీలో పూర్తిగా నాశనమైంది. ప్రస్తుతం “ప్రత్యేక హోదా ఇవ్వడం, విభజన హామీల అమలు” అంటూ మరో పల్లవి ఎత్తుకోవడంతో పాటు, తన ఆజన్మశత్రువు టీడీపీ తోక పట్టుకుని “ఎన్నికల గోదావరిని ఈదటానికి సిద్దపడుతున్నది”.

ఇకపోతే గత కొన్ని దశాబ్దాలుగా రాయలసీమను తనదైన (రాజకీయ అవసరాలకోసం) శైలిలో నాశనం చేసిన పార్టీయే ప్రస్తుతం “సీమ సమగ్రాభివృద్ధికి” ప్రణాళిక రచించాలని చిలక పలుకులు పలుకుతూ ఉంది.

కాషాయదళం

“రాజకీయాలలో హత్యలుండవు- కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి” అన్న నానుడికి ఏపీలో కాషాయదళం ప్రత్యక్ష ఉదాహరణ. 1983లో ఇక్కడ బలంగా ఉన్న కమలనాధులు టీడీపీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. ఆ తర్వాత టీడీపీతో రెండుసార్లు పొత్తు పెట్టుకొని ఏపీలో నామ మాత్రంగా మిగిలారు. 20014 రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి చేయవలసిన సాయంపై “కొండంత రాగం తీసి చివరకు గోరంత పాట” పాడారు. ప్రత్యేక హాదా విషయంలో మాటమార్చి, చంద్రబాబుతో కలసి అనేక కుప్పిగంతులు వేసి చివరకు రాష్ట్ర ప్రజల దృష్టిలో పెద్ద దొంగలుగా మిగిలారు. పోలవరం ప్రాజెక్ట్ విషయం పై చంద్రబాబు చేతిలో చిత్తుగా ఓడారు.

విభజనలో తన వంతు పాత్ర పోషించి, ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించిన బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఆశించిన మేరకు రాష్ట్రానికి సాయం చేయలేక పోగా, చేసిన సాయం చెప్పుకోవడంలో పూర్తిగా విఫలమైంది. “రాజధాని ఎంపిక, రైల్వే జోన్ ఏర్పాటు, నిర్మాణంలోఉన్న ప్రాజెక్ట్ లు పూర్తి చేయడం,కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, వెనుకపడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి, లాంటి అంశాల అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించలేదు.

ఇకపొతె రాయలసీమ వెనుకపడిందని, ఆదుకుంటామని అనేకసార్లు ప్రకటించి, రాయలసీమ డిక్లరేషన్ పేరుతొ బీజేపీ నాయకులు పెద్ద హంగామా చేశారు. ఆచరణలో చతికల పడ్డారు.

జనసేనాని పవన్ కళ్యాణ్

కొత్తగా ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించిన జనసేనాని పవన్ కళ్యాణ్ 2014 లో బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకొని వైస్సార్ కాంగ్రెస్ ను దెబ్బకొట్టారు. ప్రస్తుతం ఆరునెలల నుంచి జనంలో తిరుగుతూ తన పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల “జనసేనలో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని” చంద్రబాబు ప్రశ్నించడం, జగన్ పై తీవ్రంగా మాటల దాడి చేయడం లాంటి చర్యలతో ఆయన జనాన్ని కన్ఫ్యూషన్ లో ఉంచారు. వచ్చే ఎన్నికలలో ఆయన ఏ మార్గం ఎంచుకుంటాడో, ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో ఎవరూ చెప్పలేని స్థితి. ఆయన కూడా మాటలలో రాయలసీమపై అపార ప్రేమ చూపినా ఆచరణలో ఎమీ చేస్తారో తెలియదు.

పాతకాపులు కమ్యూనిస్టులు

టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ రాష్ట్రంలో దెబ్బ తిన్న పార్టీల్లో కమ్యూనిస్టులు కూడా ఒకరు. రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం పరాన్నభుక్కులుగా మిగిలిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జాతీయ స్థాయిలో తీసుకొనే నిర్ణయాల మేరకే పని చేస్తాయనేది జగమెరిగిన సత్యం. కార్యకర్తల బలమే ఈ పార్టీలకు ఊపిరి. రాష్ట్ర సమస్యల పైన, ప్రాంతీయ సమస్యలపైన అపుడప్పుడు గొంతు విప్పడం, ఉనికి చాటుకోవడానికి ఆందోళనలు చేపట్టడం లాంటి పనులు చేస్తారు. ఏది ఏమైనా వీరు సమస్యల సాధనలో పెద్దగా సాధించిన ప్రగతి లేదనే చెప్పవచ్చు.

రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు గతానికి పాతరవేసి ప్రస్తుతం కొత్త ఎత్తుగడలతో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్నాయి. ఈ ఎన్నికలలో ఎవరు ఎవరితో కలుస్తారో? రాజకీయంగా ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో ? ఎంతమంది ఎన్ని పార్టీలు మారి అధినేతలకు ఎంత టెన్షన్ పెట్టగలరో? ప్రజలకు ఎన్ని సినిమాలు చూపుతారో? రాయలసీమపై ఎంత ప్రేమ ఒలక పోస్తారో? నాయకులు ప్రజలకు ఇంకెన్ని ఆశలు చూపి, ఎన్ని కోట్లు కుమ్మరించి ఎన్నికల గోదాలో దిగుతారో? కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే చూడటానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి. అన్ని పార్టీలకు, వారి వెంట వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న జనానికి “తెలుగు రాజ్యం. కామ్ “ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందచేస్తున్నది.