Chandrababu – Vijay Bhaskar: రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ విస్తరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా సోలార్ రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగేలా ఎల్విన్ సంస్థ తీసుకుంటున్న చర్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్విన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రిని కలిసి, రాష్ట్రంలో సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు పురోగతిని గురించి వివరించారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుసంధానంగా, రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఇళ్లపై సోలార్ రూఫ్టాప్లను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని తెలిపారు.

ఇప్పటికే తమ సంస్థ ద్వారా సుమారు 500 మంది యువతకు ఉపాధి కల్పించామని, రాబోయే ఏడాదిలో 20 వేల ఉద్యోగాలను కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. సోలార్ రంగంలో సంస్థ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ‘ఈక్వీ మేగజైన్’, ‘సోలార్ క్వార్టర్’ సంస్థల నుంచి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నట్లు విజయ్ భాస్కర్ వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఎల్విన్ సంస్థ పనితీరును ప్రశంసించారు. నాణ్యతా ప్రమాణాలు, వినియోగదారుల సంతృప్తి విషయంలో సంస్థ చూపుతున్న నియమాలను అభినందించారు. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ, రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగ అభివృద్ధికి మరింతగా తోడ్పడాలని సీఎం సూచించారు.

