హతఃవిధీ… బాబుని భువనేశ్వరే నమ్మడం లేదా..?

తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో “చంద్రబాబుని ఆయన సతీమణి భువనేశ్వరి గారే నమ్మడం లేదా..?” అనే ఓ ప్రశ్న సోషల్ మీడియాలోనూ, సామాన్య ప్రజానికంలోనూ విపరీతంగా వినిపిస్తోంది. అందుకు కారణం ఏపీలో, ప్రధానంగా దేవతల రాజధానిగా చెప్పే “అమరావతి” వంటి ప్రాంతంలో తనను చూసి పెట్టుబడులు పెడతారని చంద్రబాబు చెబుతోన్న వేళ.. హెరిటేజ్ సంస్థ వైస్ ఛైర్‌ పర్సన్ గా ఉన్న నారా భువనేశ్వరి మాత్రం తమ సంస్థ పెట్టుబడులు మరో రాష్ట్రంలో పెడుతున్నారు! ఇది ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది.

అవును… భారతదేశంలోని ప్రముఖ డెయిరీ సంస్థల్లో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ ఒకటనే సంగతి తెలిసిందే! ఇది పాలు, పెరుగు, నెయ్యి, జున్ను సహా ఇతర పాల ఉత్పత్తుల తయారీలను విక్రయిస్తుంటుంది!

1992లోనే నారా చంద్రబాబు నాయుడు దీనిని స్థాపించారని కొంతమంది చెబితే… ప్రముఖ నటుడు మోహన్ బాబు వెర్షన్ మరోలా ఉంటుందని మరికొంతమంది అంటారు! ఇది ప్రస్తుతానికి అప్రస్తుతం అనుకుంటే.. ప్రస్తుతం ఆ సంస్థకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వైస్ ఛైర్‌ పర్సన్ గా ఉన్నారు!

ఈ నేపథ్యంలో హైదరాబాద్ సమీపంలో ఉన్న శామీర్ పేటలో ఈ సంస్థ తాజాగా ఐస్‌ క్రీమ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది! కొంత కాలంగా ఐస్‌ క్రీమ్, ఇతర వాల్యూ యాడెడ్ డెయిరీ ప్రొడక్ట్స్‌ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ అత్యాధునిక ఐస్ క్రీమ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ పేర్కొంది! దీనికోసం చంద్రబాబు ఫ్యామిలీ సుమారు రూ.204 కోట్లు పెట్టుబడి పెట్టగా.. వచ్చే ఐదేళ్లలో రూ.500-700 కోట్లకు పెంచాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు!

దీని ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు లభిస్తాయని.. స్థానికంగా చాలా మందికి ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగానూ ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ… తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు తనను చూసే పెట్టుబడులు వస్తాయని.. తనపై ఉన్న క్రెడిబిలిటీతోనే దేశవ్యాప్తంగా, ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడతాయని చంద్రబాబు చెప్పుకుంటున్న వేళ.. తన సొంత కుటుంబ సభ్యులే, తన భార్య వైఎస్ ఛైర్ పర్సన్ గా ఉన్న తన ఫ్యామిలీ వ్యాపార సంస్థే.. ఏపీలో కాకుండా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారిందని అంటున్నారు!

దేశంలోని గొప్ప గొప్ప సంస్థలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని.. ఆ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు సమకూర్చేలా సింగిల్ విండో సిస్టంని ఏర్పాటు చేశామని.. ఫలితంగా పలు సంస్థలు పెట్టుబడులతో పరుగెత్తుకుంటూ వస్తున్నాయని, వస్తాయని, తద్వారా లక్షలాదిమందికి ఉపాధి దొరుకుతుందని అటు చంద్రబాబు, ఇటు లోకేష్ లు చెబుతోన్న వేళ… వీరిద్ధరి సతీమణులు నడుపుతున్న సంస్థ ఏపీలో కాకుండా పక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో అటు విపక్షం వైసీపీ, ఇటు ప్రజానికం ఫైరవుతున్నారు!

అమరావతిలో ఇప్పటివరకూ గరిష్టంగా ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలే జరుగుతున్నాయి తప్ప, ప్రైవేటు సంస్గ్థలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో… కనీసం హెరిటేజ్ సంస్థ అయినా పెట్టుబడులు పెట్టి, ఆ అమరావతికి భూములిచ్చిన సమీప ప్రాంతాల్లోని యువతకు ఉద్యోగాలు ఇచ్చేలా ఆలోచన చేసి ఉంటే బాగుండేదని చెబుతున్నారు.

చంద్రబాబుని నమ్మి సొంత కుటుంబ సభ్యులే ఏపీలోనూ, దేవతల రాజధాని లోనూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాని నేపథ్యంలో.. ఇక మిగిలిన సంస్థల పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు ప్రజానికం. మరి ఈ ప్రశ్నకు చంద్రబాబు & కో నుంచి ఏదైనా సమాధానం వస్తుందా.. లేక, ఎదురు దాడి, ఎదురు ప్రశ్నలే వినిపిస్తాయా అనేది వేచి చూడాలి..? నవ్విపోదురు గాక నాకేటి..? ఇది యాపారం…!