చంద్రబాబుకు షాక్… జైలు అధికారుల కీలక నిర్ణయం!

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జైలు అధికారులు బాబు షాక్ ఇచ్చారు! ఇందులో భాగంగా… ఇప్పటి వరకు చంద్రబాబును కలవడానికి న్యాయవాదులకు ఇస్తున్న ములాఖత్‌ లను అధికారులు కుదించారు. వరుసగా మూడు కోర్టుల్లో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఇది పెద్ద షాక్ అని అంటున్నారు.

స్కిల్ స్కాం కేసులో ఉన్న చంద్రబాబుకు ఇప్పటివరకూ రోజుకు రెండు సార్లు లాయర్లను కలిసేవారు. దీంతో… జరుగుతున్న కేసులకు సంబంధించి రెండుపూటలా లాయర్లు చంద్రబాబును కలిసి పరిస్థితిని వివరించేవారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండు ములాకత్ లను కాస్తా ఒకటికి కుదించారు. దీంతో… రోజుకు కేవలం ఒకసారి మాత్రమే లాయర్లు చంద్రబాబు కలిసే వీలు ఉంటుంది.

చంద్రబాబుపై నమోదైన పలు కేసుల విచారణలు కోర్టులో జరుగుతున్నాయి. ఏసీబీకోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పలు పిటిషన్లకు సంబంధించిన విచారణలు జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసు, అంగళ్ల కేసులో చంద్రబాబు పేరు ప్రముఖంగా ఉన్న సంగతి తెలిసిందే.

దీంతో… ఈ కేసులకు సంబంధించిన పిటిషన్లు దాఖలు చేయడానికి న్యాయవాదులు రోజుకు రెండు సార్లు చంద్రబాబును కలుస్తున్నారు. ఈ క్రమంలో ఆ కేసులకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసిన చంద్రబాబు ఇచ్చే సూచనలు నమోదు చేసుకోవడం, కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలను చర్చించడం జరుగుతుంది. ఈ సమయంలో లాయర్ల ములాకత్ ను రోజుకు ఒక్కసారికి కుదించారు.

అయితే భద్రతా కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వీఐపీ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు జైలులో ఎంతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ములాఖత్‌ ల సమయంలోనూ చంద్రబాబుకు సెక్యూరిటీని మరింతగా పెంచుతున్నారు. ఆ సమయంలో సాధారణ ఖైదీలకు ఇబ్బంది ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు.

ఇలా చంద్రబాబు ములాఖత్‌ ల సంఖ్య తగ్గించడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. చంద్రబాబుతో లాయర్లు మాట్లాడకుండా ఉంచేందుకు ఇలా చేశారని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ములాఖత్‌ ల సంఖ్య పెంచాలని కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సుప్రీంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఇదే సమయంలో మధ్యంతర బెయిల్ ను పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది.