పవన్‌ని కలిసి సంఘీభావం తెలిపిన చంద్రబాబు.! పొత్తులు ఖాయమేనా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనని టీడీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్‌గా అభివర్ణించారు వైసీపీ నేతలు చాలామంది. ఈ విషయాన్ని జనసేన అధినేత వద్ద ప్రస్తావిస్తే, ‘సన్నాసులు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు..’ అని తేల్చేశారు.

కానీ, విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చిన పవన్ కళ్యాణ్‌తో తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఏం, రెండు పార్టీలకు చెందిన అధినేతలు కలవకూడదా.? అంటే, కలవకూడదన్న రూల్ అయితే లేదు. వైసీపీకి ఈ విషయమై అనుమానాలు వుండటంలోనూ తప్పేమీ లేదు.

రాజకీయాల్లో విమర్శలు, అనుమానాలు సహజం. వైసీపీ విమర్శలు చేస్తుంంటుంది.. అనుమానాలు వ్యక్తం చేస్తుంటుంది టీడీపీ – జనసేన మైత్రి గురించి. ‘తూచ్, మా మధ్య ఎలాంటి స్నేహం లేదు’ అనిగానీ, ‘ఔను, స్నేహం వుంది’ అనిగానీ.. బీజేపీ, టీడీపీ చెప్పుకోవచ్చుగాక.! అది వేరే సంగతి.

‘చెప్పుతో కొడతా, సన్నాసుల్లారా.. యెదవల్లారా..’ అంటూ ప్యాకేజీ ఆరోపణలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు రెచ్చిపోయారు. ఆ వెంటనే చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ.. వెరసి, దీనర్థమేంటి.?  వైసీపీ ఆరోపణలు నిజమనే కదా అర్థం.?

‘రెండు పార్టీలకు చెందిన అధినేతలు కలిస్తే.. ప్యాకేజీ అని లింకు పెట్టేస్తారా.?’ అన్న ప్రశ్న జనసేన నుంచీ, టీడీపీ నుంచీ ఉత్పన్నం కావొచ్చుగాక. ఓ రెండ్రోజులు ఆగి పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయితే, ఈ పరిస్థితి వచ్చేదే కాదు. చంద్రబాబు నుంచి దూరంగా వుండడం జనసేనానికే మంచిది. ఆ విషయంలో వైసీపీ కొంత మేలు చేస్తోంది జనసేనకి. కానీ, జనసేన మాత్రం, టీడీపీ ట్రాప్‌లో పడుతూనే వుంది.