తమ్ముళ్లు హర్ట్: చంద్రబాబుకు ఆ ధైర్యం లేదు!

నమ్ముకున్న నాయకుడు ధైర్యవంతుడై ఉండాలని, సమర్థుడై ఉండాలని, తమ పరువు ప్రతిష్టలు కాపాడుతూ.. కాలర్ ఎత్తుకుని తిరిగేలా చేసేవాడై ఉండాలని అనుచరులు కోరుకోవడం అత్యంత సహజం. అయితే.. ఈ విషయంలో టీడీపీ కార్యకర్తలు మాత్రం తెగ ఫీలయిపోతున్నారంట. వారు నమ్ముకున్న చంద్రబాబుకు ధైర్యం లేదని వాపోతున్నారంట. జగన్ తో కంపెర్ చేసుకుని కుమిలిపోతున్నారంట.

అవును… జగన్ కున్న ధైర్యంలో సగం కూడా మా బాబుగారికి లేదు అని తెగ ఫీలయిపోతున్నారంట తమ్ముళ్లు. అందుకు కారణమైంది… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన సంఘటనలు. వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించారని, పార్టీ గీసిన గీత దాటారని చెబుతూ… ఇటీవల నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు వైఎస్ జగన్. క్రమశిక్షణ లేనిచోట పాజిటివ్ ఫలితాలుండవని బలంగా నమ్మిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో వైసీపీ సోషల్ మీడియా జనాలు జగన్ ని తెగపొగిడేస్తున్నారు. గట్స్ అంటే ఇలా ఉండాలి. జగన్ భేష్ అని కొందరు పొగుడుతుంటే… అదే గనక వేరే పార్టీలో అయితే ప్రత్యేకంగా పిలిపించి నూనెరాసి సవరదీసేవారని.. బుజ్జగింపుల పర్వానికి తెరలేపేవారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దీంతో తెగ ఫీలయిపోతున్నారంట టీడీపీ సోషల్ మీడియా జనాలు.

పార్టీ టిక్కెట్లపై గెలిచి, ప్రస్తుతం వైకాపా గూటికి చేరుకున్న నలుగురు టీడీపీ నేతలపై బాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారంతా ఫీలవుతున్నారంట. చేవ లేకా.? చేతకాకా..? అని ప్రశ్నిస్తున్నారంట. మరోవైపు వల్లభనేని వంశీలాంటోళ్లు బాబును చెడుగుడు ఆడుకుంటున్నా కూడా… సైలంటుగా ఉంటే… వంశీ ఆరోపణలు నిజం అని జనం నమ్మే ప్రమాధం లేకపోలేదని హెచ్చరిస్తున్నారంట.

మరి తమ్ముళ్లు చేస్తున్న ఈ సూచనలను బాబు స్వీకరిస్తారా..? వీరి మనోవేదనను అర్ధం చేసుకుని అనుకూల నిర్ణయం తీసుకుంటారా..? లేక, “తానింతే” అని సైలంటుగా ఉంటారా అనేది వేచిచూడాలి!