కోకాపేటనీ వదలని చంద్రబాబు… ఈ సెటైర్లు చదవాల్సిందే!

రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఏ గొప్ప పని జరిగినా.. ఏ మంచిపని జరిగినా.. అదంతా తన చలవే అని చెప్పుకోవడంలో చంద్రబాబు ఏమాత్రం సంకోచించరని చెబుతుంటారు. జనం నవ్వూతారేమో అనే సృహ లేకుండా మాట్లాడగలగటంలో చంద్రబాబుది అందెవేసిన నోరు అని అంటుంటారు! ఈ క్రమంలో తాజాగా కోకాపేట భూముల ధరలు ఆ స్థాయిలో ఉండటానికి కారణం తానేనని చెప్పుకున్నారు బాబు!

అవును… హైదరాబాద్‌ అభివృద్ధి క్రెడిట్‌ ను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునేందుకు ఏమాత్రం వెనుకాడని చంద్రబాబు… హైదరాబాద్‌ కు ముగ్గుపోసింది తానేనని, ఐటీ వచ్చింది తన వల్లేనని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… సత్యనాదెళ్ల, అబ్దుల్‌ కలాం, పీవీ సింధూ… బాబు వాడకానికి కారెవరూ అనర్హం అన్నట్లుగా సాగుతుంటుంది ఆయన వ్యవహారం. ఈ క్రమంలోనే కోకాపేటా క్రెడిట్ తనదేనని చెప్పుకున్నారు.

తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబు.. అప్పట్లో తన చర్యల వల్లే హైదరాబాద్‌ ఇప్పుడు ఇలా అభివృద్ధి చెందుతున్నదని చెప్పుకొచ్చారు. సంపదను సృష్టించడం నేర్పించింది తెలుగుదేశం పార్టీ అని సెలవిచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ లో తాను వేసిన ఫౌండేషన్‌ తోనే ఇప్పుడు భూముల రేట్లు పెరిగాయని.. అందుకే కోకాపేటలో భూమి ఎకరానికి వంద కోట్లకు చేరుకున్నదని చెప్పారు చంద్రబాబు!

అక్కడితో ఆగని చంద్రబాబు… గతంలో కోకాపేటలో ఎకరం భూమి ధర కేవలం 20-30 వేలు మాత్రమే ఉండేదని.. కనీసం లక్ష రూపాయలు కూడా ఉండేది కాదని చెప్పుకొచ్చారు చంద్రబాబు. అలాంటి ప్రాంతంలో తాను ఫార్మూలావన్‌ తేవాలనుకున్నానని.. కానీ, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పడానికి కూడా తెగించారు! ఈయన సీఎంగా ఫార్ములా వన్ రేస్ పెడితే… వైఎస్సార్ అడ్డుకోవడం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి.

దీంతో చంద్రబాబుపై సెటైర్లు పేలుతున్నాయి. “సిగ్గుందా జీడిగింజా అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నదంట” అని ఒకరు అంటే… “మందికి పుట్టిన బిడ్డల్ని మన బిడ్డలని చెప్పుకునే అలవాటు ఇంకా పోవడంలేదాయనకు” అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. “కన్నార్పకుండా అబద్దాలు చెప్పడంలో ఆయన నిష్ణాతులు” అని ఇంకొంతమంది అంటున్నారు.

అయితే కోకాపేటకు ఫార్ములా వన్ తేవాలనుకున్నప్పుడు నాడు వైఎస్సార్ అడ్డుకున్నారని చెబుతున్న చంద్రబాబు… దేవుడు ఆయుస్సు ఇస్తే ముందు ముందు… అమరావతికి తాను ఒలెంపిక్స్ తెద్దామనుకుంటే వైఎస్ జగన్ అడ్డుకున్నారని చెప్పినా ఆశ్చర్యం లేదన్ని అంటున్నారు!!