చల్లా బాబు డ్రైవర్ వాంగూల్మం… పుంగనూరు మర్డర్‌ ప్లాన్ ఇదే.?

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుంగనూర్ ఘటన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనేకమంది పోలీసులు ఆస్పత్రిపాలయ్యారు! ఈ విషయంపై పోలీస్ అధికారుల సంఘం తీవ్ర స్థాయిలో ఫైరయ్యింది. తమపై టీడీపీ కార్యకర్తలు దాడికి తెగించారని మండిపడ్డారు. అయితే ఈ ఘటన వెనుక ఎవరున్నారు.. ఎలా ప్లాన్ చేశారు.. అనే విషయాలు తాజాగా తెరపైకి వచ్చాయి.

అవును… ఈనెల 4వ తేదీన పుంగనూరు వద్ద జరిగిన విధ్వంసకాండతో పదుల సంఖ్యలో పోలీసులపై హత్యాయత్నం జర­గడం.. వాహనాలు తగులబెట్టడం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నింది­తుడిగా ఉన్న పుంగనూరు టీడీపీ ఇన్‌ చార్జ్‌ చల్లా బాబు పరారీలో ఉండగా.. ఇతని డ్రైవర్‌ కలకడ నవీన్‌ కుమార్, మరో ఇద్దరు నిందితులు దోవల అమర్‌నాథ్, సి.పెద్దన్నలను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సమయంలో చల్లా బాబు డ్రైవర్‌ నవీన్‌ కుమార్ ను పోలీసులు విచారించగా.. ఈ కుట్రలకు సంబంధించిన పూర్తి ప్లాన్‌ ను విస్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది. నిందితుడి నేర ఒప్పుదల వాంగ్మూలంలో పలు విషయాలను పూస గుచ్చినట్లు చెప్పేశాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో పుంగనూర్ ఘటన పక్కా ప్లాన్ చేసిన దారుణం అని.. ఇది మర్డర్ ప్లాన్ అని అంటున్నారు!

ఈ నెల 4వ తేదీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటన పుంగనూరు బైపాస్‌ మీద వెళ్లాల్సి ఉండగా.. అనుమతి లేకున్నా పుంగనూరు పట్టణంలోకి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన ఘటనకు ఈనెల 1వ తేదీనే ప్లాన్ చేశారట. ఆ రోజు ఉదయం చల్లా బాబు, ఇతని పీఏ గోవర్దన్‌ రెడ్డి, డ్రైవర్‌ నవీన్‌ కుమార్‌ ముగ్గురూ రొంపిచెర్ల నుంచి పుంగనూరుకు కారులో బయలుదేరారట.

ఆ సమయంలో కొద్ది దూరం వెళ్లగానే చల్లా బాబు ఫోన్‌ లో మాట్లాడటం మొదలుపెట్టాడట. ఆ సమయంలో “సరే సార్‌.. మీరు చెప్పినట్లే చేస్తాను. బీరు బాటిళ్లు, కర్రలు, రాళ్లు అన్నీ అక్కడ డంప్‌ చేస్తాం. మిమ్మల్ని టౌన్‌ లోకి రానివ్వమంటూ పోలీసులు చెప్పగానే మనవాళ్లు దాడి చేస్తారు. పోలీసులను కానీ, జనాలను కానీ దాడి చేసి చంపైనా సరే మీరు చెప్పినట్లే పోగ్రాం పెట్టిస్తా సార్‌..” అని మాట్లాడినట్లు చెప్పారని సమాచారం!

ఆ మరుసటి రోజు రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లె పంచాయతీ, గర్నిమిట్టవారిపల్లెలోని చల్లా బాబు ఇంటి వద్ద టీడీపీలోని ముఖ్యమైన నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారట. ఇందులో రాళ్లు, మద్యం బాటిళ్లు, టపాకాయ బాంబులు, కర్రలు ఎక్కడ డంప్‌ చేయాలో చెప్పాడట.

ఇక మూడో తేదీనాడు చల్లా బాబు మరికొంత మంది టీడీపీ నాయకుల్ని తన ఇంటి వద్దకు పిలిపించాడట. పుంగనూరు విధ్వంసకాండ ఎలా చేయాలి.. పోలీసులను ఎలా చంపాలి.. వాళ్లు ఫైర్‌ ఓపెన్‌ చేసేలా ఎలా రెచ్చగొట్టాలి.. ఆపై జరిగే అల్లర్లలో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయాలపై మాట్లాడారని అంటున్నారు.

ఈ క్రమంలో 4వ తేదీ ఉదయం 10 గంటలు కావస్తోంది. చల్లా బాబు అంగళ్లుకు వెళ్లారు. అక్కడ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యాడు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆపై చల్లా బాబు, అతని పీఏ గోవర్దన్‌ రెడ్డి, డ్రైవర్‌ నవీన్‌ కుమార్‌ తో కలిసి కారులో పుంగనూరు బయలుదేరారు.

ఈ సమయంలో పీఏ గోవర్దన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశాడంట. “అన్నా.. ఇదే జరిగితే పెద్ద గొడవలు జరుగుతాయి. పోలీసులు మనపై కేసులు పెడతారు. ఎట్టా అన్నా..” అని గోవర్దన్‌ రెడ్డి, చల్లా బాబును ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో… “పోలీసులు పెట్టే కేసుల్ని కోర్టులో మన ‘సార్‌’ చూసుకుంటాడు..” అని చల్లా బాబు భరోసా ఇచ్చాడని పోలీసులకు చెప్పారని అంటున్నారు!