వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు నుంచి త్వరలోనే బయటికి వస్తాడనుకున్నా… పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను కుటుంబ స్థాయిలో తీవ్రంగా దూషించిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అనంతపురం కోర్టు తాజాగా ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినప్పటికీ, బోరుగడ్డకు విడుదల దాదాపుగా అసాధ్యంగా మారింది.
ఇప్పటికే సర్కిల్ ఇన్స్పెక్టర్ను బెదిరించిన కేసులో నాలుగు సార్లు రిమాండ్ విధించగా, ఇప్పుడు నకిలీ మెడికల్ సర్టిఫికెట్ వ్యవహారం ఆయనకు పెను ఇబ్బందిగా మారింది. మునుపటి ఒక కేసులో తల్లి ఆరోగ్య పరిస్థితి పేరిట నకిలీ వైద్య పత్రాలను కోర్టులో సమర్పించి బెయిల్ పొందిన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వాటిపై విచారణ జరిపి వాటి నిజాయితీపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆసుపత్రి డాక్టర్లు ఇచ్చిన నివేదికలో అవి అసలైనవికావని తేలడంతో మరో కేసు నమోదైంది.
ఇటీవల హైకోర్టు కూడా బోరుగడ్డ తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించాలన్న ఆలోచన ఎంత ప్రమాదకరమో కోర్టు స్పష్టం చేసింది. పైగా నకిలీ పత్రాలపై మరింత లోతుగా విచారణ జరపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీనితో బోరుగడ్డపై ఇంకా నేర విచారణలు కొనసాగుతుండటంతో తాజా బెయిల్ వల్ల మేలు జరగని పరిస్థితి.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న బోరుగడ్డకు బెయిల్ వచ్చినా బయటకు రావడమే గగనంగా మారింది. న్యాయవాదులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేసుల సంఖ్య, విచారణ దశలను బట్టి స్పష్టత లేదని చెబుతున్నారు. మరి సోషల్ మీడియాలో చురుగ్గా నడిచిన బోరుగడ్డ ఎప్పుడు విడుదల అవుతారో చూడాలి.