ఏపీలో ఆలయాలపై దాడులు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. రామతీర్థం కేంద్రంగా రాజకీయ రచ్చ జరుగుతోంది. వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేన మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ పాలనలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండాపోతోందని టీడీపీ విమర్శిస్తుంటే, టీడీపీయే దాడులు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రచేస్తోందని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. ఇక బీజేపీ-జనసేన నేతలు ఆందోళనలు చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.
తాజాగా ఓ జాతీయ న్యూస్ ఛానల్ న్యూస్ ఎక్స్ తో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ క్రిస్టియన్ అని పలువురు ఆరోపిస్తున్నారని… జగన్ ఎలా క్రిస్టియన్ అవుతారో తనకు అర్థం కావడం లేదని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. గతంలో ఒక రోజు తెల్లవారుజామున 2 గంటలకే తిరుమల వేంకటేశ్వరస్వామి పూజలో జగన్ పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు.
అలాంటి వ్యక్తిని క్రిస్టియన్ అని ఎలా చెప్పగలమని అన్నారు. జగన్ క్రిస్టియన్ అని ఎవరైనా ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ఈ ఆరోపణల వెనుక చంద్రబాబు కుట్ర దాగుందని చెప్పారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన చంద్రబాబు ఘోర ఓటమిని మూటకట్టుకున్నారని, ఈ నేపథ్యంలో, మళ్లీ పూర్వవైభవం సాధించేందుకు ఆయన కుట్రలు చేస్తున్నారని అన్నారు. హిందుత్వను వేదికగా చేసుకుంటున్నారని విమర్శించారు. టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్)తో ఆడిట్ చేయించాలనే గొప్ప నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని స్వామి చెప్పారు. ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని కితాబిచ్చారు. అంతేకాదు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని క్రిస్టియన్లు ప్రచారం చేసి.. రాజకీయ విమర్శలు చేశారని టీడీపీపై ఆయన మండిపడ్డారు. కానీ వారిద్దు నరేంద్ర మోదీ కంటే నిఖార్సైన హిందువులని స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.