బాలయ్యను ఆడుకుంటున్న బియ్యపు… ఏం కావాల సామి?

మొదటి రోజు తీవ్ర గందరగోళం, పలువురి వికృత చేష్టల నడుమ సాగిన ఏపీ అసెంబ్లీ.. రెండో రోజు కూడా దాదాపు అలాంటి వాతావరణంలోనే మొదలైంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, మరి ముఖ్యంగా బాలకృష్ణ ఈలలు వేయడం హాట్ టాపిక్ గా మారింది. అనంతరం చంద్రబాబు సీటు ఎక్కి నినాదాలు చేయడం కూడా జరిగింది.

అయితే ఈ విషయాలపై శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేశారు. అసెంబ్లీలో రచ్చ జరుగుతున్న సమయంలో మైకందుకున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి… తనదైన వ్యంగ్యంతో బాలయ్యపై స్పందించారు. ఇందులో భాగంగా… బాలకృష్ణ వద్ద మెంటల్ సర్టిఫికెట్ ఉందని స్పీకర్ కు గుర్తు చేయడం గమనార్హం!

ముందుగా… వాళ్ల విజిల్స్ చూస్తుంటే కాలేజీలో అమ్మాయిల‌కు సైట్ వేసిన‌ట్టుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల మాదిరిగా ప్రవ‌ర్తిస్తున్నారా? అని ప్రశ్నించిన బియ్యపు… అసెంబ్లీలో చంద్రబాబు సీట్లో బాల‌కృష్ణ కూర్చుని ఉంటే పైనున్న ఎన్టీఆర్ ఎంతో సంతోషంగా వుంటారు. క‌నీసం నిజ జీవితంలో చేయ‌క‌పోయినా, అసెంబ్లీలో వ‌చ్చి బాబు సీట్లో కూర్చున్నారని అని ఎద్దేవా చేశారు.

అనంతరం ద‌య‌చేసి బాల‌కృష్ణను అసెంబ్లీలోకి రానివ్వొద్దు అధ్యక్షా… ఎందుకంటే మెంటల్‌ గా స‌మ‌స్య వుంద‌ని ఆయ‌న స‌ర్టిఫికెట్ తెచ్చుకున్నారు. బాల‌కృష్ణకు మెంట‌ల్ ఉన్నట్లుగా స‌ర్టిఫికెట్ వుంది. బాల‌య్య గ‌న్ తీసుకొచ్చి నిన్ను (స్పీకర్ ని ఉద్దేశించి), న‌న్ను, అంద‌ర్నీ కాల్చేస్తాడు అని అన్నారు.

అనంతరం… తన వెటకారాన్ని మరింత పెంచిన బియ్యపు… “బాలయ్య కాల్చేస్తే.. ఏం కావాల సామి. కేసు కూడా ఉండ‌దు. ద‌య‌చేసి స‌ర్టిఫికెట్ చూసి లోప‌లికి పంపాల‌ని స్పీక‌ర్‌ ను వేడుకుంటున్నా. టీడీపీ స‌భ్యులంద‌రినీ స‌స్పెండ్ చేసి, మాన‌సిక వైద్య‌శాల‌కు పంపాలి” అని ఆయ‌న స్పీక‌ర్‌ కు విన్నవించారు.

ఇలా బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఉందని, ఆయన ఎవరిని కాల్చినా కేసు ఉండదని.. అందువల్ల ఆయనను అసెంబ్లీకి రానివ్వకుండా మెంటల్ హాస్పటల్ కి పంపాలని సూచించడం.. ఆయన స్టైల్లో సూచించడంతో సభలో నవ్వులు విరిసాయి!