కడప జిల్లాలో చంద్రబాబుకు షాక్

కడప జిల్లాలో చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగిలింది. జిల్లాలో సీనియర్ నేత, కమలాపురం నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ వీర శివారెడ్డి తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తొందరలోనే వైసిపిలో చేరబోతున్నట్లు మాజీ ఎంఎల్ఏ ప్రకటించారు.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపురం నుండి పోటీ చేయటానికి వీరశివారెడ్డి టికెట్ ఆశించారు. అందుకోసం చాలా గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ లాభం లేకపోయింది. టికెట్ కోసం శివారెడ్డి ఎంత ప్రయత్నించినా  చంద్రబాబు పట్టించుకోలేదు. చంద్రబాబు వైఖరితో అలిగిన వీరశివ ఎన్నికల్లో పార్టీ విజయానికి పెద్దగా పని కూడా చేయలేదు.

వీరశివారెడ్డి అలిగిన విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే కొందరు నేతలను పంపించి రాయబారం నడిపించారు. పార్టీ అధికారంలోకి రాగానే ఎంఎల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో టిడిపికి ఘోర పరాజయం తర్వాత వీరశివా చాలా కాలంగా పార్టీ నేతలతో టచ్ లో కూడా లేరు. చివరకు ఆదివారం టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించటం సంచలనంగా మారింది.