బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వైసీపీ నమ్మడం దండగే.!

అసలేమయ్యింది బాలినేని శ్రీనివాస్ రెడ్డికి.? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ మాట జవదాటే పరిస్థితి వుండేది కాదు ఒకప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి విషయంలో. అదే సమయంలో, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాటని ఏ పరిస్థితుల్లోనూ కొట్టిపారేసేవారు కాదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

కానీ, రోజులు మారాయ్.! ఎక్కడో ఈక్వేషన్ బెడిసి కొట్టింది. గతంలో వున్నంత సన్నిహిత సంబంధాలైతే ఇప్పుడు లేవు ఇద్దరి మధ్యా.! జగన్ అపాయింట్మెంట్ కావాలంటే, సజ్జల రామకృష్ణా రెడ్డిని బాలినేని శ్రీనివాస్ రెడ్డి బతిమాలుకోవాల్సిందే.

వైవీ సుబ్బారెడ్డి కావొచ్చు, విజయసాయిరెడ్డి కావొచ్చు.. వీళ్ళు సైతం, బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తగిన ‘సాయం’ చేయలేకపోతున్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే, వైఎస్ జగన్‌తో వున్న సాన్నిహిత్యం నేపథ్యంలో, బాలినేని శ్రీనివాస్ రెడ్డి రిస్క్ తీసుకోలేకపోతున్నారు.

టీడీపీ నుంచీ, జనసేన నుంచీ, బీజేపీ నుంచీ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి స్పష్టమైన హామీలే వున్నాయట. కొత్తగా వైఎస్ షర్మిల నుంచి.. అంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు మంచి ఆహ్వానమే లభించినట్లు చెబుతున్నారు.

ఎటూ వైసీపీలో సరైన గౌరవం దక్కడం లేదు గనుక, సమయం చూసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి హ్యాండ్ ఇస్తారన్న ప్రచారమైతే జరుుగతోంది. అందుకే, బాలినేనికి కీలక బాధ్యతలు అప్పగించడానికి వైసీపీ అధినాయకత్వం తటపటాయిస్తోంది. ఇక్కడే, గ్యాప్ మరింత పెరుగుతూ వస్తోంది.

‘ఇలా పార్టీలో కొనసాగడం కష్టం’ అని సన్నిహితుల వద్ద బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడో చెప్పేశారట.! కానీ, ఎందుకో తటపటాయిస్తున్నారు. ఇలా ఊగిసలాడుతున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డిని నమ్ముకోవడం వైసీపీకి కూడా అనవసరం.!