Ambati vs Pemmasani: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు పరాకాష్టకు చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన ఘాటు విమర్శలకు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇరు పార్టీల మధ్య పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.
పెమ్మసాని హెచ్చరిక: “ఒక్క మాటతో చంపేయగలం”
గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జగన్ చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండించారు. “జగన్ గారు.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదు. ఆయన్ని (జగన్ను) ఒక్క మాటతో చంపేయగలం, కానీ మాకు సంస్కారం ఉంది. చంద్రబాబు గారు నేర్పిన క్రమశిక్షణ, మా విలువలు మమ్మల్ని అడ్డుకుంటున్నాయి. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప, బాడీ షేమింగ్ చేయడం సరికాదు” అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
Pemmasani Chandrasekhar: జగన్కు కేంద్రమంత్రి పెమ్మసాని మాస్ వార్నింగ్: “చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం”

అంబటి రాంబాబు రిటార్ట్: “నువ్వేమైనా రౌడీవా?”
పెమ్మసాని వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. పెమ్మసాని వ్యాఖ్యలను తప్పుబడుతూ ఎక్స్ (X) లో వరుస పోస్టులు చేశారు.
“మాటతోనే చంపే రౌడీవా పెమ్మసాని? వచ్చే ఎన్నికల్లో ప్రజలు బ్యాలెట్తో తంతే నువ్వు నేరుగా అమెరికాలో పడతావ్ జాగ్రత్త!”
అంటూ అంబటి ఎద్దేవా చేశారు. గతంలో తన అరెస్ట్ సమయంలో కూడా పెమ్మసాని “సినిమా చూపిస్తాం” అన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇలాంటి భాష వాడటం తగదని హితవు పలికారు.
గత కొద్ది రోజులుగా జగన్ – చంద్రబాబు మధ్య సాగుతున్న ‘మైండ్ సెట్’ వివాదం ఇప్పుడు ద్వితీయ శ్రేణి నేతల మధ్య వ్యక్తిగత దూషణలకు దారితీసింది. ఒకవైపు అభివృద్ధి మంత్రం జపిస్తున్నామని చెబుతున్న కూటమి నేతలు, మరోవైపు జగన్ విమర్శలపై అంతే ఘాటుగా స్పందిస్తుండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

