Pemmasani Chandrasekhar: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు, బాడీ షేమింగ్ వంటి వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. గుంటూరులోని బీఆర్ స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా పెమ్మసాని ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలు మాట్లాడండి.. వ్యక్తిగత దూషణలు వద్దు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖం గురించి, ఆయన మైండ్ సెట్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై పెమ్మసాని తీవ్రంగా మండిపడ్డారు. “ముఖ్యమంత్రిని కించపరిస్తే మేమూ బాడీ షేమింగ్ చేయగలం.. కానీ మా సంస్కారం మమ్మల్ని అడ్డుకుంటోంది. మీలా నోటికి ఏది వస్తే అది మాట్లాడలేము. రాష్ట్ర అభివృద్ధి గురించి, రాజకీయాల గురించి లేదా సబ్జెక్ట్ గురించి చర్చించండి. అంతేకానీ, వ్యక్తిగత విమర్శలకు దిగితే చూస్తూ ఊరుకోం” అని హెచ్చరించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ జగన్పై పెమ్మసాని విమర్శలు గుప్పించారు.
ప్రజావేదికను కూల్చివేయడం ఏ మైండ్సెట్కు నిదర్శనం?, పట్టాదారు పాసుపుస్తకాలపై సొంత ఫొటోలు ముద్రించుకోవడం రాజ్యాంగబద్ధమా?, మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను వేధించి, ఆయన మృతికి కారణమవ్వడం ఎలాంటి సంస్కృతి?, ఇలాంటి పనులు చేసిన జగన్, ఇతరుల మైండ్సెట్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు.
తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన నాయకుడు చంద్రబాబు అని పెమ్మసాని కొనియాడారు. అటువంటి దార్శనికత కలిగిన నాయకుడిపై స్థాయి లేని విమర్శలు చేయడం జగన్ మానుకోవాలని సూచించారు.

