AP Weather Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుకుంది. నడి వేసవి రాకముందే ఎండలు రోళ్లు పగిలేలా కాస్తుండటంతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడచిన కొద్దిరోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత తోడవ్వడంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎండల తీవ్రత భీకరంగా ఉంది.
నంద్యాలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రతపై ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న (గురువారం) నంద్యాల జిల్లా సంజామలలో 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ సీజన్లోనే అత్యధికం.
రెండో స్థానంలో కడప ఉంది కడప జిల్లా ఒంటిమిట్టలో 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. దాదాపు 150కి పైగా మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచాయి.
నేడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత 43 నుంచి 44.5 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాలు కింద ఉన్నవి.
రాయలసీమ: నంద్యాల, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాలు.
కోస్తా ఆంధ్ర: పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం.
ఉత్తరాంధ్ర: పార్వతీపురం మన్యం జిల్లా.

“వచ్చే రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.” – విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు మరియు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎండలు మరియు వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తలకి టోపీ లేదా కర్చీఫ్ ధరించాలి. లేత రంగు కాటన్ వస్త్రాలు ఉత్తమం. కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మంచినీరు, ఓఆర్ఎస్, మజ్జిగ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఉన్నవారు మరియు వృద్ధులు మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకపోవడమే మంచిది అని సూచించారు.
రాష్ట్రంలో మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

