AP Heatwave: ఏపీని వణికిస్తున్న భానుడు: నేడు 76 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!

AP Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. రోహిణి కార్తె రాకముందే రాష్ట్రంలో ‘రోళ్లు పగిలే’ ఎండలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. సామాన్యులు రోడ్లపైకి రావాలంటేనే హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం నాటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరడం రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఎలా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది.

మంగళవారం నాడు రాష్ట్రంలోని దాదాపు 288 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో గరిష్టంగా 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయి రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. రాయలసీమ నుంచి ఉత్తర కోస్తా వరకు ఎండల తీవ్రత ఏకధాటిగా కొనసాగుతోంది. మే నెల నాటికి ఈ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మండలాల వారీగా వడగాల్పుల హెచ్చరిక:- ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తాజా బులెటిన్ ప్రకారం.. నేడు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

తీవ్ర వడగాల్పులు వీచే మండలాలు: విజయనగరం (21), శ్రీకాకుళం (19), అనకాపల్లి (15), కాకినాడ (6), పోలవరం (5), అల్లూరి సీతారామరాజు (4), పార్వతీపురం మన్యం (3), తూర్పుగోదావరి (2), విశాఖపట్నం (1). మొత్తంగా 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 130కి పైగా మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని అధికారులు అప్రమత్తం చేశారు.

ఒకవైపు ఎండ.. మరోవైపు వాన!
రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండలు మండిపోతున్నప్పటికీ, ఉపరితల ఆవర్తనం కారణంగా కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. “పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.”

ప్రజలకు సూచనలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకూడదు. బయటకు వెళ్లాల్సి వస్తే తెల్లటి కాటన్ వస్త్రాలు ధరించాలి, తలకి టోపీ లేదా కర్చీఫ్ కట్టుకోవాలి. వేడి గాలి నేరుగా చెవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ వాడాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మంచినీరు, ఓఆర్ఎస్ (ORS), మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.

Officers Supports Jagan In Kutami Govt | Telugu Rajyam