ఎమ్మెల్సీ రిజల్ట్స్ లైట్… జగన్ ధైర్యం ఇదే!

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైకిల్ స్పీడ్ పెంచడం, ఫ్యాన్ స్లో అయిపోవడం తెలిసిందే. దీంతో మైకులముందుకొచ్చిన టీడీపీ నేతలు… రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేస్తుందని.. అందుకు తాజా ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనం అని చెప్పుకుంటున్నారు. అయితే… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు – సార్వత్రిక ఎన్నికలకూ చాలా వ్యత్యాసం ఉందని, జగన్ బలం గురించి చెబుతున్నారు విశ్లేషకులు.

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలైనా… జగన్ లైట్ తీసుకున్నారని, సార్వత్రిక ఎన్నికల్లో జగన్ లెక్కలు జగన్ కి ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. అవేంటో.. ఇప్పుడు చూద్దాం!

ప్రస్తుతం ఏపీలో ఫించన్లు తీసుకునేవారు దాదాపు 60 లక్షల మంది వరకు ఉన్నారు. వీరందరికీ దాదాపు ప్రతి నెలా 1వ తేదీనే వారి ఇంటి వద్దనే వలంటీర్ల ద్వారా రూ.2750 పింఛన్ అందిస్తున్నారు జగన్. దీన్ని 2024 జనవరి నాటికి రూ.3 వేలు చేయనున్నారు. దీంతో… పింఛన్ లబ్ధిదారులంతా జగన్ కే ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఆ 60లక్షల్లో మెజారిటీ ప్రజలు… సంత్రుప్తిగా ఉన్నారనేది వారి అంచనా!

ఇదే క్రమంలో… పేదలకు ఇళ్లు స్కీమ్ కింద దాదాపు 35 లక్షల మంది మహిళలకు వాళ్ల పేరుతోనే జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. సో.. వీరు కూడా జగన్ ని కాదనే ప్రసక్తి లేదని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇక వైఎస్సార్ ఆసరా కింద మహిళా సంఘాలకు డ్వాక్రా రుణమాఫీ చేస్తుండటంతో వీరిలో కూడా మెజారిటీ మహిళలు వైసీపీకే ఓట్లేస్తారని అంటున్నారు. కాగా… డ్వాక్రా మహిళలు రాష్ట్రంలో సుమారు 90 లక్షల మంది ఉన్నారు!

వీటికి తోడు అమ్మఒడి, విద్యా దీవెన వసతి దీవెన, గోరుముద్ద, వాహన మిత్ర, మత్య్సకార భరోసా, నేతన్న నేస్తం, కాపు నేస్తం, ఆరోగ్యశ్రీ వంటి అనేక పథకాలను జగన్ ప్రభుత్వం అందిస్తుంది. సో… నవరత్నాలు పొందిన ప్రజలు, జగన్ సంక్షేమాన్ని అందుకున్న జనాలు ఎక్కువగా లేని గ్రాద్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోనక్కరలేదని.. కాకపోతే ఒకసారి రివ్యూ చేసుకుంటే సరిపోతుందని.. పైన చెప్పుకున్న లిస్ట్స్ తో జగన్ ధైర్యంగా ఉన్నారని వివరణ ఇస్తున్నారు విశ్లేషకులు!