భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న లేదా అక్కడికి ప్రయాణించే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సహాయం అందించేందుకు న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారం, సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
జమ్మూ కశ్మీర్, లడఖ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఈ కేంద్రాన్ని సంప్రదించవచ్చని చంద్రబాబు సూచించారు. ఈ ప్రత్యేక కేంద్రం 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ పని చేస్తుందని అధికారికంగా ప్రకటించారు. భద్రతా పరిస్థితులపై కేంద్రం, సరిహద్దు రాష్ట్రాల అధికారులతో ఏపీ భవన్ అధికారులు నిరంతరం సమన్వయం చేస్తూ ఉంటారని తెలిపారు.
సహాయం కోసం సంప్రదించాల్సిన ముఖ్యమైన ఫోన్ నంబర్లు: 011-23387089, 9871999430, 9871999053. అదనంగా ఎం.వి.ఎస్. రామారావు (డిప్యూటీ కమిషనర్) ను 98719 90081 నంబరులో, వి. సురేశ్ బాబు (లైజన్ ఆఫీసర్) ను 9818395787 నంబరులో సంప్రదించవచ్చు. ప్రభుత్వం తనవంతు బాధ్యతగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎం అన్నారు.