బిగ్ బ్రేకింగ్: చంద్రబాబుపై మరో కేసు.. పీటీ వారెంట్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 14 ఓజుల రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో 10 రోజులుగా ఉంటున్నారు. ఈ సమయంలో ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై మరో కేసులో పీటీ వారంట్‌ జారీ అయ్యింది.

ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై తాజాగా వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు వెలువరించడానికి రెండు రోజుల సమయం పడుతుందని కోర్టు ప్రకటించింది. ఇదే సమయంలో… సీఐడీ కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది.

మరోపక్క తాజాగా ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై మరో కేసులో పీటీ వారంట్‌ జారీ అయ్యింది. ఏపీ ఫైబర్‌ నెట్‌ కుంభకోణంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ పిటి వారెంట్ వెలువడింది. ఈ పిటీష‌న్‌ ను కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. దీంతో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, పుంగనూరు అల్లర్ల కేసుల సరసన ఇప్పుడు నాలుగో కేసు చేరినట్లయ్యింది.

కాగా… ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కాంలో రూ.121 కోట్ల నిధులు దోచుకున్నారని సిట్‌ దర్యాప్తులో తేలిందంటూ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019లోనే ఫైబర్‌ నెట్‌ స్కాంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ-1 గా వేమూరి హరి ప్రసాద్‌, ఏ-2 గా మాజీ ఎండీ సాంబశివరావుగా పేర్కొంది.

అయితే వేమూరి హరిప్రసాద్‌, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఫైబర్‌ నెట్‌ స్కాంలో చంద్రబాబు పాత్రను సీఐడీ గుర్తించిందని అంటున్నారు. టెర్రా సాఫ్ట్‌ కు టెండర్లు ఇవ్వడంపై సీఐడీ విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌ లిస్ట్‌ లో ఉన్న టెర్రా సాఫ్ట్‌ కు టెండర్‌ దక్కేలా మేమూరి హరిప్రసాద్ చక్రం తిప్పారని పేర్కొంది.

ఫైబర్‌ నెట్‌ ఫేజ్‌-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా.. రూ. 121కోట్ల మేర అవినీతిని సీఐడీ గుర్తించిందని అంటున్నారు. చంద్రబాబు సూచనల మేరకే టెర్రా సాఫ్ట్‌ వ్యవహరం మలుపులు తిరిగిందని ఏసీబీ ఆరోపిస్తుంది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై పీటీ వారంట్‌ దాఖలయ్యింది.

మరోపక్క ఇదే విషయంపై అధికార వైసీపీ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యింది. ఈ మేరకు… “ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై మ‌రో కేసులో పీటీ వారెంట్ దాఖ‌లు చేసిన ఏపీ సీఐడీ. ఫైబ‌ర్ నెట్ పేరుతో రూ.121 కోట్ల మేర అవినీతి జ‌రిగింద‌ని గుర్తించిన‌ సీఐడీ. 2021లోనే ఈ స్కాంలో 19 మందిపై కేసు న‌మోదు. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా వేమూరి హ‌రిప్రసాద్‌, ఏ2 ముద్దాయిగా మాజీ ఎండీ సాంబశివ‌రావు. ప్రస్తుతం చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ వారెంట్ దాఖ‌లు చేసిన సీఐడీ. పిటీష‌న్‌ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు” అని ట్వీట్ చేసింది.