Rayachoti: రాయచోటిని తప్పించి, మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు చంద్రబాబునాయుడి నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఏపీలో కొత్తగా మూడు జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇకపై మదనపల్లె కీలకం కానుంది. ఈ నేపథ్యంలో నేతల నుంచి వస్తోన్న వ్యాఖ్యలు పలు సందేహాలను తెరపైకి తెస్తున్నాయి. పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ విషయపై మాట్లాడిన మంత్రులు.. ఈ నిర్ణయాలన్నీ ప్రజాభిష్టం మేరకే జరిగాయని చెబుతున్నప్పుడు.. ప్రజలు కోరుకుంటేనే రాయచోటిని పక్కనపెట్టారా..?
అదే నిజమైతే ఆదివారం ఉదయం రాయచోటిలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన ఎందుకు తెలియజేశారు.. రాయచోటి విషయంలో తేడా వస్తే ఊరుకోమని ఎందుకు హెచ్చరించారు..?
రాయచోటిని మార్చకపోతే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు చెప్పినట్టు ప్రచారం చేస్తోన్నారు.. ఇంతకాలం లేని సమస్య, ఇప్పుడు ఎందుకు వస్తుందనే ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారు..?
ఎన్నికల ముందు రాయచోటి విషయంలో స్ట్రాంగ్ గా మాట్లాడిన రాంప్రసాద్ రెడ్డి.. ఇప్పుడు చేతులు కాలిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకోవడం ఎవరీ ఏమార్చడానికి..?
కేబినెట్ మంత్రి అయిన రాంప్రసాద్ రెడ్డికి సైతం చెప్పకుండానే రాయచోటి విషయంలో చంద్రబాబు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారా..?
మంత్రి పదవి కోసం జిల్లాను అమ్ముకున్నాడని సోషల్ మీడియాలో కనిపిస్తోన్న పోస్టులు కూడా ప్రజలు పెట్టినవే… ఇందులో వాస్తవం లేదంటారా..?

రాయచోటి వాసులు భయపడినట్టే జరిగింది. అన్నమయ్య జిల్లా మూడు ముక్కలు అయ్యింది. ఏపీ కేబినెట్ లో కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా… రాజంపేటను కడపలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతూ ఆమోదించారు. వైసీపీ హయాంలో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు రాయచోటిని రద్దు చేసి, మదనపల్లెను జిల్లా కేంద్రంగా నిర్ణయించారు. దీంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై రాయచోటి ప్రజలు నిప్పులు కక్కుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన మంత్రి మండిపల్లి… గత 40 రోజులుగా జిల్లాను నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలిపారు.. జిల్లా ఎక్కడికీ పోదని అన్నారు! తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో.. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి.. తనకు ఆంధ్ర, తెలంగాణ రెండు కళ్లు అని అధినేత అన్నట్లుగా… తనకు పార్టీ, రాయచోటి నియోజకవర్గ ప్రజలు రెండు కళ్లలాంటివని మండిపల్లి వ్యాఖ్యానించారు!
పైగా ఈ విషయంలో చంద్రబాబు &కో తనను కావాలనే, వ్యూహాత్మకంగా మోసం చేశారు అనే సందేహాలు, అర్ధాలు వచ్చేలా ఓ వ్యాఖ్య చేశారు మంత్రి మండిపల్లి. ఇందులో భాగంగా… నవంబర్ 27వ తేదీన వచ్చిన గెజిట్ లో ఎక్కడ కూడా జిల్లా కేంద్రం మార్పు లేదని… ఈ ముప్పై రోజుల్లో రాయచోటి జిల్లా మార్పు ప్రస్తావన రాలేదని.. కాని చివరి రెండు రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారాని.. ఏమని అడిగితే.. ప్రజాభిష్టం మేరకు అంటున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు!
అంటే ఇప్పుడు జిల్లా కేంద్రంగా రాయచోటి పోవడానికి చంద్రబాబే పూర్తి కారణం అని.. తన ప్రమేయం ఏమీ లేదని.. రాంప్రసాద్ రెడ్డి చెప్పాలనుకుంటున్నారనే అనే సందేహాలు ఈ సందర్భంగా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మంత్రి పదవికి రాజీనామా ఎప్పుడు రాంప్రసాద్ రెడ్డి? అని ప్రత్యర్థులతో పాటు రాయచోటి వాసులు నిలదీస్తున్నారు. ఈ సమయంలో ఓ కీలక దృశ్యం తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా… రాయచోటి జిల్లా కేంద్రం కాకపోతే రాజీనామా చేస్తానంటూ ఢాంబికాలు పలికిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. తన అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికో.. లేక, ప్రజల ముందు పెర్ఫార్మెన్స్ లో భాగమో.. అదీగాక తన మాటను చంద్రబాబు డస్ట్ బిన్ లో పాడేశారనే ఆవేదనో.. రాయచోటిని నిలుపుకోలేకపోతే తన భవిష్యత్తు ఏమవుతుందో అన్న విషయం గుర్తొచ్చో తెలియదు కానీ.. కన్నీళ్లు పెట్టుకున్నారు!
అయితే… ఈ కన్నీటిని జనం నమ్మడం లేదని తెలుస్తోంది. ఈ సందర్భంగా… రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు కార్చినంత మాత్రాన ప్రయోజనం లేదని, జిల్లా వెళ్లిపోవడానికి తమ ప్రజాప్రతినిధి అసమర్థతే కారణమని జనం భావిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా… ఇటీవల కూటమి ప్రభుత్వం ఏమి పట్టుకున్నా మట్టైపోతుందనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తుండటం గమనార్హం!!
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ నిర్ణయం ప్రజాభిష్టం మేరకే అని ప్రభుత్వం చెబుతోంది! అంటే… జిల్లా కేంద్రం కావాలని మదనపల్లి వాసులు అడిగారా.. లేక, తమకు వద్దని రాయచోటి ప్రజలు కోరారా? ఎందుకంటే.. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికంటే ముందే రాయచోటి ప్రజలు తమ నిరసనలు, అభిప్రాయాలు తెలిపారు. మరి రాయచోటి ప్రజల అభిష్టాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదా..?

